'ఏం పాకిస్తాన్ చేతిలో ఓడిపోతామని భారత్కు భయమా?'.. ఆసియా కప్ వేదిక మార్చనందుకు బీసీసీఐ, ఏసీసీని టార్గెట్ చేస్తూ పీసీబీ మాజీ చీఫ్ నజాం సేథీ చేసిన కామెంట్స్ ఇవి. కొలంబో నుంచి భారత్, పాకిస్తాన్ సూపర్-4 మ్యాచ్ మార్చలేదని అతను ఈ వ్యాఖ్యలు చేశాడు. దానికితోడు అంతకుముందు మ్యాచులో నేపాల్ కూడా భారత బౌలింగ్ను సమర్ధవంతంగా ఎదుర్కొని మంచి స్కోరు చేసింది.
దీంతో పాక్ ఫ్యాన్స్ ఇదే విషయాన్ని నెట్టింట తెగ ట్రెండ్ చేశారు. పాక్తో పూర్తి మ్యాచ్ ఆడాలంటే భారత్కు వణుకని, అందుకనే వర్షం పడే కొలంబోలోనే మ్యాచ్ నిర్వహిస్తున్నారని నానా విమర్శలూ చేశారు. కానీ అవన్నీ వట్టి మాటలే అని తేలిపోయింది. ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన భారత్, పాక్ మ్యాచులో టీమిండియా చెలరేగింది. అసలు రెండు టీమ్స్ ఒకే పిచ్పై ఆడాయా? అని అనుమానం వచ్చేలా మ్యాచ్ సాగింది.

రిజర్వ్ డేను 147/2తో ప్రారంభించిన భారత్కు కేఎల్ రాహుల్ (111 నాటౌట్), విరాట్ కోహ్లీ (122 నాటౌట్) అదిరిపోయే స్కోరు అందించారు. వీళ్లిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో భారత జట్టు కేవలం రెండు వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్ బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారనే చెప్పాలి. ఆరంభంలో బుమ్రా, సిరాజ్ ఇద్దరూ అద్భుతమైన స్వింగ్తో పాక్ ఓపెనర్లను వణికించారు.
ఇక ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ వచ్చి పాక్ బ్యాటింగ్ లైనప్ను తుత్తునియలు చేశాడు. దీంతో ఆ టీం కేవలం 128 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది చూసిన టీమిండియా ఫ్యాన్స్ ఊరుకుంటారా? కనీసం నేపాల్ చేసినంత స్కోరు కూడా చేయలేదని పాక్ టీంను ట్రోల్ చేస్తున్నారు. 'ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. అసలు పసికూన టీం ఏది?' అని అడుగుతున్నారు.
'జింబాబ్వే, నేపాల్తో మ్యాచ్ అనుకున్నారా? గెలిచేయడానికి' అని పాకిస్తాన్ను కొందరు ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక కుల్దీప్ బౌలింగ్ను పాక్ బ్యాటర్లు ఎవరూ ఆడలేకపోయారని కూడా అంటున్నారు. భారత్పై నేపాల్ కూడా 230 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. కానీ పాకిస్తాన్ ఆ స్కోరు కూడా చేయలేక చేతులెత్తేయడంపై నెట్టింట తెగ జోకులు పేలుస్తున్నారు ఫ్యాన్స్.