ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత తొలగినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరగనున్నట్లు సమాచారం. అయితే మొన్నటివరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగడం అనుమానంగా సాగింది. పాకిస్థాన్కు ఎట్టిపరిస్థితుల్లో టీమిండియాను పంపించమని బీసీసీఐ స్పష్టం చేయడం, మరోవైపు హైబ్రిడ్ మోడల్లోనే టోర్నీ నిర్వహిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పట్టుబట్టడంతో.. టోర్నీ నిర్వహణపై అనిశ్చితి ఏర్పడింది.
కానీ ఇటీవల ఐసీసీ నిర్వహించిన సమావేశంలో పాక్ బోర్డు హైబ్రిడ్ మోడల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు షరతులతో అంగీకరించింది. హైబ్రిడ్ మోడల్ కారణంగా తమ ఆదాయానికి గండి పడుతుందని, కాబట్టి ఐసీసీ నుంచి వచ్చే రెవెన్యూను అధిక మొత్తంలో పెంచాలని షరతు పెట్టింది. అంతేగాక తమ జట్టును కూడా ఇండియాకు పంపించమని మరో షరతు తెలిపింది. అయితే తాజాగా మరో విషయం బయటకు వచ్చింది.

భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ ఒప్పందం నిర్వహించడానికి ఐసీసీ చర్యలు తీసుకున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వచ్చే మూడేళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుందని తెలిపింది. ఒప్పందంలో భాగంగా వచ్చే మూడేళ్లలో భారత్-పాక్ తలపడే మ్యాచ్లు.. తమ సొంతగడ్డపై నిర్వహించడానికి కుదరదు. తటస్థ వేదిక అయిన దుబాయ్లో నిర్వహించాల్సి ఉంటుంది.
అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మినహా మెగాటోర్నీలకు పాకిస్థాన్ ఇప్పట్లో ఆతిథ్యం ఇచ్చే పరిస్థితులు లేవు. కానీ భారత్లో వచ్చే ఏడాది ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్, మెన్స్ ఆసియా కప్ జరగనుంది. అంతేగాక 2026లో శ్రీలంకతో సంయుక్తంగా మెన్స్ టీ20 వరల్డ్ కప్కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఒప్పందంతో భారత్కు కలిసొచ్చేదేమి లేదు. కాగా, 2008 ముంబయి దాడుల అనంతరం భారత జట్టు పాకిస్థాన్లో పర్యటించని విషయం తెలిసిందే. ద్వైపాక్షిక సిరీస్లతో పాటు ఆసియా కప్ వంటి టోర్నీల కోసం టీమిండియా తమ దేశానికి రావాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎన్నిసార్లు విన్నవించినా బీసీసీఐ అంగీకరించలేదు.