IND vs PAK: 2026లో జరగబోయే టీ20 ప్రపంచ కప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ మెగా టోర్నీలో భారత్, పాకిస్తాన్ల మధ్య మరోసారి పోరు జరగనుంది. తాజాగా ఈ మ్యాచ్ జరిగే తేదీ గురించి వార్త వెలుగులోకి వచ్చింది. వీరిద్దరి మధ్య ఫిబ్రవరి మధ్యలో ఈ మహా సంగ్రామం జరిగే అవకాశం ఉంది. దీనితో పాటు టీ20 ప్రపంచ కప్కు సంబంధించిన మరికొన్ని కీలక విషయాలు కూడా వెల్లడయ్యాయి.
భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడు?
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే ఎప్పుడూ ఉత్కంఠభరితంగా ఉంటుంది. 2025 ఆసియా కప్లో రెండు జట్ల మధ్య 3 మ్యాచ్లు జరగగా.. ఈ మూడింటిలోనూ టీమిండియా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పాకిస్తాన్తో కేవలం ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే ఆడతామని భారత ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో అభిమానులు తదుపరి సీనియర్ జట్టు పోరాటం ఎప్పుడా అని ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 2026 టీ20 ప్రపంచ కప్లో భారత్, పాకిస్తాన్లు తలపడనున్నాయి. నివేదికల ప్రకారం.. 2026 ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా ఈ రెండు జట్ల మధ్య బ్లాక్బస్టర్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఏ ఫార్మాట్లో అయినా పాకిస్తాన్పై టీమిండియా ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ టీ20 ప్రపంచ కప్లోనూ భారత జట్టు పాకిస్తాన్పై తమ పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది.

టీ20 ప్రపంచ కప్ 2026కు సంబంధించి కీలక అప్డేట్లు
టీ20 ప్రపంచ కప్ 2026 గురించి మరికొన్ని కీలక అప్డేట్లు కూడా బయటకొచ్చాయి. టీమిండియా తమ తొలి మ్యాచ్ను అమెరికా జట్టుతో ఆడే అవకాశం ఉంది. గత ప్రపంచ కప్లో అమెరికా ప్రదర్శన ఊహించిన దానికంటే మెరుగ్గా ఉండటంతో ఈసారి వారి పోరాటం ఆసక్తికరంగా ఉండనుంది. భారత జట్టు సెమీఫైనల్కు చేరుకుంటే ఆ మ్యాచ్ 2026 మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే అవకాశం ఉంది. గతంలో వచ్చిన వార్తల ప్రకారం.. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఫైనల్ తేదీ మార్చి 8 కావచ్చు.
గత ప్రపంచ కప్ తర్వాత మారిన టీమిండియా
భారత జట్టు 2024 టీ20 ప్రపంచ కప్ను గెలుచుకున్న తర్వా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో జట్టులో అనేక మార్పులు వచ్చాయి. రిషబ్ పంత్ కూడా టీ20 జట్టులో భాగం కాకుండా, అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, సంజు శాంసన్, వరుణ్ చక్రవర్తి వంటి యువ ఆటగాళ్లు టీ20 జట్టులో తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నారు.