
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో తన యుద్ధం బంతి పైనే గానీ, ఆటగాళ్ల పేర్లతో కాదని టీమిండియా టెస్టు ఓపెనర్ మురళీ విజయ్ అన్నాడు. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా బుధవారం దక్షిణాఫ్రికా పర్యనటకు బయల్దేరనుంది. ఈ నేపథ్యంలో మురళీ విజయ్ మాట్లాడాడు.
'నా పోరాటం కేవలం బంతితోనే.. బౌలర్లతో కాదు. మ్యాచ్ గమనానికి అనుగుణంగా నా ఆట ఉంటుంది. వ్యక్తిగతంగా ఈ పర్యటన నాతో పాటు జట్టుకు ఎంతో మంచి అనుభవం. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి బౌలర్కి ఓ శైలి ఉంటుంది. సొంతగడ్డపై అయితే, అది మరింత పదునెక్కుంది. విదేశీ గడ్డపై పరుగులు చేయడం గొప్ప అనుభూతినిస్తుంది' అని అన్నాడు.
'ఇప్పటి నుంచే సిరీస్ తీరు గురించి మాట్లాడటం బాగుండదు. నా వరకు మైదానంలో సహజ శైలి ఆటతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని ఆశిస్తున్నా. మన ఆటగాళ్లు విదేశీ గడ్డపై ఎలాంటి ప్రదర్శన చేయగలరో అన్నది ఇప్పుడు అందరి ఆలోచన. విదేశీ పర్యటనల్లో మంచి ప్రదర్శన చేయాలనే అనుకుంటాం' అని మురళీ విజయ్ అన్నాడు.
'నేను గతంలో చాలా మంది దిగ్గజాలతో ఆడాను. ప్రతిసారి అందరం బాగా ఆడాలనే ప్రిపేర్ అయ్యేవాళ్లం. కానీ, ఆడలేకపోయాం. కోహ్లీ ఇప్పటికే జట్టు కోసం వ్యూహాలు సిద్ధం చేసి ఉంటాడు. ప్రతి ఒక్కరి కోసం అతడు ప్రణాళికలు రచించుకుంటాడు. ప్రాక్టీస్ కోసం ఒకరు వెయ్యి బంతులు ఆడతారు. మరికొంతమంది నెట్స్లో ప్రాక్టీస్ చేయ్యరు. అయినప్పటికీ వారు సిద్ధంగానే ఉంటారు' విజయ్ వివరించాడు.
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కోహ్లీసేన మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లతో కూడిన సిరిస్ ఆడనుంది. జనవరి 5న కేప్ టౌన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో భారత బ్యాట్స్మెన్-దక్షిణాఫ్రికా బౌలర్స్ మధ్య ఆధిపత్య పోరుగా ఈ సిరీస్ని అందరూ అభివర్ణిస్తున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.