హైదరాబాద్: టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ ఇంటిపై స్ధానిక యువకులు దాడికి పాల్పడ్డారు. అంతేకాదు షమీని బెదిరించి ఇంట్లోకి సైతం చొరబడేందుకు యత్నించారు. శనివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే దక్షిణ కోల్కతా కట్జునగర్లో షమీ నివాసం ఉంది. శనివారం రాత్రి షమీ, ఆయన భార్య కారులో ఇంటికి తిరిగి వస్తుండగా షమీ కారు డ్రైవర్ ఇంటికి సమీపంలో స్థానిక యువకుడికి చెందిన మోటారు బైక్ను ఢీకొంది.
దీంతో షమీ డ్రైవర్కు, మోటారు బైక్ నడిపిన ఆ యువకుడికి మధ్య గొడవ జరిగింది. పరిస్థితి చేయి దాటుతుండటంతో షమీ కారులోంచి దిగివచ్చి ఇద్దరినీ శాంతింపజేశారు. అయితే, కాసేపటి తర్వాత ఆ యువకుడు మరికొంతమంది తన స్నేహితులను వెంట బెట్టుకొని వచ్చి షమీపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో షమీ ఇంటి వద్ద పెద్ద గొడవ చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన గేట్కీపర్పై చేయిచేసుకున్నాడు. ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ తతంగం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. దీంతో ఈ ఘటనపై షమీ భార్య జదవ్ పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇదిలా ఉంటే త్వరలో జరగనున్న శ్రీలంక సిరీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో షమీ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. లంక పర్యటనలో కోహ్లీసేన మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 ఆడనుంది.