హైదరాబాద్: టీమిండియా వెటరన్ బ్యాట్స్మన్ యువరాజ్ సింగ్కు సెలెక్టర్లు మొండిచేయి చూపారు. శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్ కోసం ఆదివారం సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన 15 మందితో కూడిన జట్టులో యువీకి చోటు దక్కలేదు. అలాగే విండిస్ పర్యటన కోసం ఎంపిక చేసిన యువకీపర్ రిషబ్ పంత్ను కూడా తప్పించారు.
అతడి స్థానంలో కీపింగ్కూడా చేయగల కేఎల్ రాహుల్ను ఎంపిక చేశారు. అలాగే విండీస్ పర్యటనలో సత్తా చాటిన దినేశ్ కార్తీక్ను సైతం తప్పించారు. 2019 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపిక చేసినట్లు బోర్డు అధికారి పేర్కొన్నాడు. బిజీ షెడ్యూల్ను ఆధారంగా చేసుకుని సీనియర్ బౌలర్లు అశ్విన్, జడేజా, షమీ, ఉమేశ్కు విశ్రాంతినిచ్చారు.

బుమ్రాకు తిరిగి స్థానం దక్కగా, ముంబై పేసర్ శార్దూల్ ఠాకూర్ను తొలిసారి టీమిండియాకు ఎంపిక చేశారు. లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్పటేల్, లెగ్స్పిన్నర్ చాహల్, చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్లతో స్పిన్ విభాగం పటిష్టంగా ఉంది. ఇక సీనియర్ క్రికెటర్ సురైశ్ రైనాకు మరోసారి నిరాశే ఎదురైంది.
మరోవైపు సెలెక్టర్ల తాజా నిర్ణయంతో ఇక యువరాజ్ సింగ్ అంతర్జాతీయ కెరీర్కు తెరపడినట్టేనని భావిస్తున్నారు. రెండుసార్లు వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో యువీ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. భారత జట్టులో యువీ చోటుపై గతకొంతకాలంగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ధోనీని ఎంపిక చేయడంతో రాబోయే వరల్డ్ కప్కు అతడు రేస్లో ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
భారత జట్టు : కోహ్లీ (కెప్టెన్), ధవన్, రాహుల్, రోహిత్ శర్మ, ధోనీ (కీపర్), కేదార్ జాదవ్, మనీష్పాండే, హార్దిక్ పాండ్యా, అక్షర్పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాగూర్, బుమ్రా, రహానె.