రాహుల్కే కీపింగ్:
భారత జట్టు తమ చివరి టీ20 మ్యాచ్ను ఇటీవల శ్రీలంకతో ఆడింది. నాటి మ్యాచ్ తుది జట్టును చూస్తే.. పెద్దగా మార్పులు లేకుండానే ఇక్కడా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్కు విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ తిరిగి జట్టుతో చేరాడు. భుజ గాయం కారణంగా శిఖర్ ధావన్ దూరమవడంతో.. రోహిత్తో కలిసి రాహుల్ ఓపెనింగ్ చేస్తాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే రాహుల్ కీపర్గా కొనసాగనున్నాడు. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండేలు ఆ తర్వాతి స్థానాల్లో వస్తారు.
ఆరుగురు బౌలర్ల వ్యూహం:
స్వదేశంలో ఐదుగురు బౌలర్లతోనే ఆడిన టీమిండియా.. ఈసారి ఆరో బౌలర్ను ఎంచుకునే అవకాశం కనపిస్తోంది. ఆరో స్థానంలో ఆల్రౌండర్ శివమ్ దూబే బరిలోకి దిగితే అతని బౌలింగ్ ఇక్కడి పిచ్లపై పనికొస్తుంది. అప్పుడు స్పెషలిస్టు కీపర్ను జట్టులోకి తీసుకోవడానికి అవకాశం ఉండదు. దీంతో సంజూ శాంసన్, రిషభ్ పంత్ తుది జట్టులో ఆడకపోవచ్చు.
జడేజా vs సుందర్:
ఏడో స్థానంలో రవీంద్ర జడేజా లేదా వాషింగ్టన్ సుందర్లో ఒకరినే ఎంచుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. జడేజా ఇటీవల కీలక ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు కాబట్టి అతనికే అవకాశాలు ఎక్కువ. పేస్ విభాగంలో జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీలు జట్టులో ఖాయం. కుల్దీప్, చాహల్లలో ఒక్కరికే చోటు దక్కవచ్చు.
ఒత్తిడిలో కివీస్:
ఈ సిరీస్కు ముందు కివీస్ జట్టు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో వైట్వాష్ అయింది. మరోవైపు కీలక ఆటగాళ్లు ట్రెంట్ బౌల్ట్, లుకీ ఫెర్గూసన్, బ్రేస్వెల్, మ్యాట్ హెన్రీ గాయాల కారణంగా టీ20లకు దూరమయ్యారు. అయితే ప్రస్తుతం జట్టులో ఉన్న పలువురు ఆటగాళ్లకు భారత్పై మెరుగైన రికార్డే ఉంది. కొలిన్ మన్రో, మార్టిన్ గప్టిల్, కెప్టెన్ కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ జట్టు బ్యాటింగ్కు అండగా నిలవనున్నారు. బౌలింగ్ విభాగంలో సౌతీ, కుగ్లెయిన్, బెనెట్, శాంట్నర్, ఇష్ సోధీ కీలకం కానున్నారు. ఆల్రౌండర్ గ్రాండ్హోమ్ జట్టుకు అతిపెద్ద బలం.
పిచ్, వాతావరణం:
ఈడెన్ పార్క్ మైదానం బ్యాటింగ్కు అనుకూలం. చిన్న బౌండరీలు కావడంతో పరుగుల వరద ఖాయం. ఇటీవల కివీస్-ఇంగ్లండ్ సిరీస్లో కూడా భారీగా పరుగులు నమోదయ్యాయి. ఆ మ్యాచ్లో సూపర్ ఓవర్ ద్వారా ఇంగ్లండ్ గెలిచింది. వాతావరణంతో మాత్రం సమస్యే. మ్యాచ్ రోజు వర్షం కురిసే అవకాశం ఉంది. పూర్తిగా కాకపోయినా ఏదో ఒక దశలో అంతరాయం కలిగించవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం 12.20 నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చహల్/కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ.
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మున్రో, సైఫెర్ట్, టేలర్, గ్రాండ్హోమ్/డారిల్ మిషెల్, శాంట్నర్, సోధి, సౌతీ, కుగ్లిన్, బెనెట్.