న్యూఢిల్లీ: దూకుడు స్వభావం గల భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని నియంత్రించాలంటే బలమైన, శక్తివంతమైన కోచ్ను టీమిండియాకు ఎంపిక చేయాలని భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ బిసిసిఐకి సూచించారు. ఇటీవల కాలంలో విరాట్ కోహ్లీ పలు వివాదాలకు కారణమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బేడీ పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
'విరాట్ కోహ్లీకి మంచి సూచనలిచ్చే కోచ్ అవసరం. కోచ్ కోహ్లీ దూకుడును కూడా కట్టడి చేయగలగాలి. కోహ్లీ తన దూకుడు స్వభావాన్ని తగ్గించుకోవాలి. క్రికెట్ అంటే కబడ్డీ లేదా ఖో ఖో కాదు. ఒకవేళ దీర్ఘ కాలం క్రికెట్ ఆడాలంటే మాత్రం.. దూకుడు స్వభావాన్ని నియంత్రించుకోవాలి' అని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

కోహ్లీ దూకుడు స్వభావాన్ని మీడియా ఎక్కువ చేసి చూపిస్తోందని బేడీ అభిప్రాయపడ్డారు. 'మీడియా అతనికి ఈ స్వభావాన్ని అంటగట్టిందని, ఇది అతడి క్రికెట్ జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఉంది' అని అన్నారు. కోహ్లీ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని తెలిపారు. అతని కదలికను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నాడు. అతడ్ని ప్రపంచం గమనిస్తోందని తెలిపారు.
'రవిశాస్త్రి, సౌరవ్ గంగూలీలను చూడండి, వారికి కోహ్లీకి ఎలాంటి పోలికలు లేవు. చాలా భేదాలున్నాయి. అలాగే సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్లతో పోల్చినా భేదాలున్నాయి. క్రికెట్ ఒక ఆట, అది వినయం, విలువలను నేర్పుతుంది' అని బేడీ చెప్పారు.