

హైదరాబాద్: నాణ్యమైన ఆటగాళ్ల కోసం టీమిండియా చింతించాల్సిన అవసరం లేదని భారత ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సృష్టం చేశాడు. గత రెండేళ్లుగా టీమిండియాలోకి వచ్చే యువ క్రికెటర్ల సంఖ్య పెరిగింది. అయితే ఈ సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం దేశవాళీ క్రికెట్ అత్యుత్తమంగా ఉండమేనని ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించాడు.
"దేశవాళీ క్రికెట్ మ్యాచ్లు చూడటమంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే.. భారత్ క్రికెట్ భవిష్యత్ అంతా అక్కడే ఉంది. ప్రతి ఏడాది దేశవాళీ క్రికెట్ నుంచి ప్రతిభ ఉన్న ఆటగాళ్లు భారత్ జట్టులోకి వస్తున్నారు. అందుకే నాతో పాటు.. సెలక్షన్ కమిటీలోని నా సహచరులు కూడా దేశవాళీ మ్యాచ్లను మిస్ అవ్వం" అని అన్నాడు.
"ప్రస్తుతం టీమిండియాలో స్థానం కోసం పోటీపెరగడం చాలా ఆనందంగా ఉంది. రిజర్వ్ బెంచ్ బలం చూస్తుంటే... మరో దశాబ్దంపాటు భారత్ జట్టుకి ఆటగాళ్ల విషయంలో బెంగ లేదు" అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చారు. చైనామన్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్ ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.
మరోవైపు యువ క్రికెటర్లు రిషబ్ పంత్, పృథ్వీ షాలు తమ అరంగేట్ర మ్యాచ్ల్లోనే అద్భుత ప్రదర్శన చేయడంతో జట్టులో తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నారు. వీరి బాటలోనే ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్, విజయ్ శంకర్ కూడా ఉన్నారు.