ముంబై: మహేంద్ర సింగ్ ధోని.. భారత్కు తన సారథ్యంలో ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. 2014లో టెస్టు క్రికెట్కు గుడ్ బై చెప్పి కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమైన ధోని గురించి, టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
2019లో ఇంగ్లండ్లో జరిగే వన్డే వరల్డ్ కప్ నాటికి ధోనీ కెప్టెన్గా ఉండకపోవచ్చని అన్నాడు. అయితే అప్పటివరకు సెలెక్టర్లు అతడినే కెప్టెన్గా కొనసాగిస్తే ఆశ్చర్యమేనని చెప్పుకొచ్చాడు. 2013లో ఇంగ్లాండ్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ధోని నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటి వరకు మరే మెజారిటీ టైటిల్ను గెలవలేదు.
2011లో భారత్కు వరల్డ్ కప్ను అందించిన ధోని కెప్టెన్సీపై ఆ తర్వాత కాలంలో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్ట్రేలియాలో జరగిన 2015 వరల్డ్ కప్లో సైతం టీమిండియా సెమీ ఫైనల్లోనే ఇంటి బాట పట్టింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓటమి, దక్షిణాఫ్రికాతో జరిగిన హోం సిరిస్లో కూడా భారత్ ఓటమి పాలవ్వడం ధోని కెప్టెన్సీ విమర్శలకు తావిస్తోంది.

ఈ క్రమంలో గంగూలీ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ధోనీ తొమ్మిదేళ్ల నుంచి జట్టును నడిపిస్తున్నాడని గుర్తు చేసుకున్న గంగూలీ, ధోనీ అద్భుతమైన కెప్టెన్ అనడంలో సందేహం లేదని, అతను వన్డే క్రికెట్ నుంచి తప్పుకోవాలన్నది తన అభిమతం కాదని అన్నాడు.
వచ్చే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని భారత సెలెక్టర్లు కెప్టెన్సీ విషయంపై సముచిత నిర్ణయం తీసుకోవాలని కోరిన గంగూలీ, జట్టు కెప్టెన్ పదవి కోసం కోహ్లీకి తాను మద్దతిస్తున్నట్టు తెలిపాడు.
కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నేను చెప్పడం లేదు
'ధోనీ 9 ఏళ్లుగా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అతను అద్భుతమైన కెప్టెన్. అయితే మరో నాలుగేళ్ల వరకు జట్టుకు కెప్టెన్సీ వహించే సామర్థ్యం మహీకి ఉంటుందా? క్రికెట్ నుంచి అతను వైదొలగాలని నేను చెప్పడం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియాకు ధోనీ అవసరముంది.' అని గంగూలీ పేర్కొన్నాడు.
మైదానంలో కోహ్లీ దృక్పథం సూపర్
'అతను క్రికెట్లో కొనసాగాలి. అయితే 2019 వరకు అతను కెప్టెన్గా ఉంటాడని నేను భావించడం లేదు. కోహ్లీ నిలకడగా రాణిస్తున్నాడు. టెస్టు కెప్టెన్గా అతని రికార్డు బాగుంది. మైదానంలో కోహ్లీ దృక్పథం సూపర్. ఆటలోనే కాదు మానసికంగా కూడా శక్తిమంతంగా కనిపిస్తాడు. కాబట్టి వచ్చే వరల్డ్ కప్కు ఎవరు కెప్టెన్గా ఉండాలన్నది సెలెక్టర్లు నిర్ణయించుకోవాలి' అని గంగూలీ అన్నాడు.