హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటన ఆధారంగా టీమిండియా బ్యాటింగ్ శైలిని విశ్లేషించారు ఐయాన్ చాపెల్. దాంతో పాటుగా తమ బౌలింగ్ విభాగం ఎంత పటిష్ఠంగా ఉందో చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చే ముందే టీమిండియా తమ బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోవాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అన్నారు. లేదంటే సొంతగడ్డపై చురకత్తుల్లాంటి బంతులు విసిరే ఆసీస్ బౌలర్లను ఎదుర్కోవడం కష్టమేనని పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ సిరీసుల్లో భారత్ బ్యాటింగ్ లోపాలు బయటపడ్డ సంగతి తెలిసిందే. 'ఆస్ట్రేలియాలో అడుగు పెట్టకముందే టీమిండియా బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోవాలి. స్టీవ్స్మిత్, డేవిడ్ వార్నర్ లేని ఆసీస్ బ్యాటింగ్ ప్రశ్నార్ధకంగానే కనిపించినా బౌలింగ్ మాత్రం ధీటుగా ఉంటుంది. మిచెల్ స్టార్క్, హేజిల్వుడ్, ప్యాట్ కమిన్స్, నేథన్ లైయన్ సిరీస్ సాంతం ఫిట్నెస్తో ఉంటే విరాట్ సేనను చిరాకు పెడతారు' అని పేర్కొన్నాడు.
'ఇంగ్లాండ్లో బంతి గమనం గాలిలో ఉంటే ఆసీస్లో అదనపు బౌన్స్ సైతం తోడవుతుంది. కోహ్లీ మినహా ఇతర బ్యాట్స్మెన్ ఇక్కడ ఆడటం కష్టమే' అని చాపెల్ తేల్చి చెప్పారు. భారత్ నవంబర్ 21 నుంచి జనవరి 18 వరకు ఆసీస్ గడ్డపై 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. ఆస్ట్రేలియా పిచ్లు రోహిత్ శర్మకు సరిపోయినా అతనెప్పుడూ టెస్టుల్లో తన సత్తా చాటలేదని చాపెల్ అన్నారు.
ఇప్పుడు అతడిని ఎంపిక చేస్తే మాత్రం మోసమే అవుతుందని పేర్కొన్నారు. ఇంగ్లాండ్లో లార్డ్స్ మ్యాచ్ తప్ప మిగతా అన్ని మ్యాచుల్లో భారత్కు గెలిచే అవవకాశాలు కనిపించాయన్నారు. సౌథాంప్టన్లో మొయిన్ అలీ స్పిన్ బౌలింగ్ను ఆడలేకపోవడం ఆశ్చర్యం కలిగించిందని వెల్లడించారు. అతడు విసిరే ప్లయిట్ డెలివరీలను పుజారా తప్ప ఎవరూ ఆడలేకపోయారన్నారు. తమ గత ప్రదర్శనలతో ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేస్తే ఇంగ్లాండ్, భారత్కు శిక్ష తప్పదని పేర్కొన్నారు.