న్యూఢిల్లీ: ప్రపంచకప్ టోర్నమెంట్ సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు ఓటమిపై మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ నోరు విప్పారు. నంబర్ ఫోర్ స్థానంలో నాణ్యమైన బ్యాట్స్మెన్ లేకపోవడం వల్లే ఈ ఓటమి ఎదురైందని తాను భావిస్తున్నానని అన్నారు. ఈ స్థానాన్ని ఎంత త్వరగా భర్తీ చేస్తే.. అంత మంచిదని చెప్పారు. ఓ మంచి బ్యాట్స్మెన్తో ఈ స్థానాన్ని భర్తీ చేయకపోతే.. బ్యాటింగ్ లైనప్ మరింత బలహీనపడే ప్రమదం ఉందని అన్నారు. యువ క్రికెటర్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడం పట్ల యువరాజ్ సింగ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రపంచకప్ టోర్నమెంట్ కోసం ఎంపిక చేసిన జట్టులో అంబటి రాయుడిని తీసుకోకపోవడం వ్యూహాత్మక తప్పిదమని వ్యాఖ్యానించారు.
నాలుగో స్థానాన్ని ఎలా భర్తీ చేస్తారో చెబుతారా?
టీమిండియా బ్యాటింగ్ లైనప్లో నాలుగో స్థానం అత్యంత కీలకమైనదని యువరాజ్ సింగ్ అన్నారు. నిజానికి ఈ స్థానం ఆయనదే. రెండు ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆయన నాలుగో స్థానంలోనే ఆడారు. అత్యవసరంగా ఈ స్థానాన్ని భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. దీన్ని భర్తీ చేసుకోకపోతే.. దాని ప్రభావం బ్యాటింగ్ లైనప్ మొత్తంపై పడుతుందని అభిప్రాయపడ్డారు. అంబటి రాయుడిని జట్టులోకి తీసుకుని- నాలుగో నంబర్ స్థానాన్ని అతనితో భర్తీ చేయించి ఉండాల్సిందని చెప్పారు. ప్రపంచకప్ టోర్నమెంట్లో అంబటి రాయుడికి చోటు దక్కకపోవడం తనను షాక్కు గురి చేసిందని అన్నారు. ఏ ఒక్క బ్యాట్స్మెన్ అయినా ఈ స్థానంలో బ్యాటింగ్కు దిగి విఫలమైతే.. అతణ్ని పక్కనపెడుతున్నారని, అది సరైన పద్ధతి కాదని చెప్పారు.
మ్యూజికల్ ఛెయిర్లా మారింది..
టీమిండియాలో నాలుగో నంబర్ స్థానం మ్యూజికల్ ఛైర్లా మారిందని యువరాజ్ సింగ్ విమర్శించారు. నాలుగైదు మ్యాచ్లల్లో విఫలమైన తరువాత అంబటి రాయుడు న్యూజిలాండ్పై జరిగిన మ్యాచ్లో రాణించాడని, మళ్లీ అతణ్ని తప్పించారని విమర్శించారు. తాజాగా- రిషబ్ పంత్ను నాలుగో స్థానంలో ఆడిస్తున్నప్పటికీ.. అతను ఎన్నాళ్లు జట్టులో ఉంటాడో తెలియదని అన్నారు. నాలుగో స్థానంలో ఆడగలడన్న నమ్మకం ఉంచిన ఓ ఆటగాడిని మళ్లీ, మళ్లీ తొలగించడం వల్ల ఉపయోగం ఉండదని చెప్పారు. దీనివల్ల ఆ ఆటగాడు తనపై తాను విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని యువరాజ్ సింగ్ అన్నారు. జట్టు ఓపెనర్లు, ఆ తరువాత వన్డౌన్ బ్యాట్స్మెన్ విఫలమైన తరువాత- క్రీజులో పాతుకుని పోయే సామర్థ్యం ఉన్న ఆటగాడిని నాలుగో నంబర్ స్థానానికి ఎంపిక చేయాలని అన్నారు.