
హైదరాబాద్: భారత్లో తొలి డేనైట్ టెస్టు మ్యాచ్ నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఎప్పటి నుంచో భావిస్తోంది. అయితే, ఈ ఏడాది అది కార్యరూపం దాల్చనుంది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో టీమిండియా-వెస్టిండిస్ జట్ల మధ్య డే-నైట్ టెస్టు నిర్వహించాలని బీసీసీఐ అందుకు తగిన ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తోంది.
ఈ విషయాన్ని బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ సయ్యద్ సాబా కరీం వెల్లడించారు. ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య నిర్వహించిన డే నైట్ టెస్టు విజయవంతం కావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ ఏడాది అక్టోబర్లో వెస్టిండిస్ జట్టు భారత పర్యటనకు రానుంది.
ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో వెస్టిండిస్ మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ ఆడనుంది. అభిమానులను స్టేడియానికి రప్పించడానికి, టెస్టు క్రికెట్ను బ్రతికించాలంటే డే నైట్ టెస్టు ఒక మార్గమని ఐసీసీ భావించిన తరుణంలో టెస్టు హోదా కలిగిన పలు దేశాలు ఇప్పటికే డే నైట్ టెస్టులను నిర్వహించి సక్సెస్ అయ్యాయి.
అయితే ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డు అయిన బీసీసీఐ మాత్రం ఇప్పటివరకు డే నైట్ టెస్టును నిర్వహించలేదు. సాధారణ టెస్టుకి డే నైట్ టెస్టుకు చాలా తేడాలున్నాయి. డే నైట్ టెస్టులో ఫ్లడ్ లైట్ల కింద గులాబి బంతిని వాడతారు. మ్యాచ్ జరిగే సమయాల్లో కూడా మార్పులుంటాయి. తద్వారా అభిమానులు స్టేడియానికి పెద్ద సంఖ్యలో వచ్చే వీలుంటుంది.
అంతర్జాతీయ క్రికెట్లోకి టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత టెస్టు క్రికెట్ను ఆస్వాదించే అభిమానులు మెల్లగా తగ్గుముఖం పడుతున్నారు. టెస్టు క్రికెట్ను బ్రతికించాలనే ఉద్దేశంతో ఐసీసీ అనేక చర్యలకు ఉపక్రమించింది. అందులో ఈ డే నైట్ టెస్టు ఒకటి. చివరిసారిగా గతేడాది డిసెంబర్లో దక్షిణాఫ్రికా-జింబాబ్వే జట్ల మధ్య పోర్ట్ ఎలిజబెత్ వేదికగా డే నైట్ టెస్టు మ్యాచ్ జరిగింది.