జొహెన్నెస్బర్గ్: ప్రమాదకర కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన క్రికెట్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు ఇప్పటికే అనేక దేశాల క్రికెట్ బోర్డులు ప్రయత్నిస్తున్నాయి. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ట్రైనింగ్ను ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తోంది. మరోవైపు భారత ఆటగాళ్లను ఐసోలేషన్ క్యాంపులో ఉంచేందుకు బీసీసీఐ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే అంతర్జాతీయ మ్యాచ్లను పునరుద్ధరించేందుకుగాను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంగ్లండ్ టూర్కు పాక్ వెళుతుందని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ బుధవారం ఓ ప్రకటలో తెలిపారు.
ప్రేక్షకుల స్థానంలో సెక్స్ డాల్స్.. ఆ క్లబ్కి రికార్డు స్థాయిలో జరిమానా!!
తాజాగా మూడు టీ20ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా పర్యటనకు భారత క్రికెట్ జట్టు రావాలని ఆ దేశ క్రికెట్ బోర్డు కోరింది. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా తాత్కాలిక సీఈవో జాక్వెస్ ఫౌల్ వెల్లడించారు. ప్రస్తుతం దీనిపై బీసీసీఐతో చర్చలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఫౌల్ పేర్కొన్నారు. అయితే టీ20 సిరీస్ జరిగే తేదీల గురించి ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటన రాలేదు.
ప్రస్తుత విపత్కర పరిస్థితుల కారణంగా మళ్లీ క్రికెట్ను ప్రారంభించాలని బీసీసీఐ కూడా తీవ్ర ప్రయత్నిస్తోంది. దీనికోసం దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం సీఎస్ఏతో చర్చలు జరుపుతోంది. 'దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ నిర్వహించడంపై సీఎస్ఏతో చర్చలు జరుపుతున్నాం. కానీ ప్రయాణ నిబంధనలు అమలులో ఉండడంతో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే సిరీస్ నిర్వహించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తాం' అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఫ్యూచర్ టూర్స్ కార్యక్రమంలో భాగం కాని ఈ సిరీస్ను నిర్వహించడానికి క్రికెట్ దక్షిణాఫ్రికా డైరెక్టర్ గ్రేమ్ స్మిత్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీలు మొదటగా ప్లాన్ చేశారట.
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్కి ముందు టీంఇండియా చివరిగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడాల్సింది. అయితే మూడు వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. ఆ తర్వాత రెండు మ్యాచ్లను కరోనా వ్యాప్తి కారణంగా రద్దు చేశారు. ఆపై ఓ వారం తర్వాత ప్రొటీస్ జట్టు స్వదేశానికి పయనమైంది. అయితే ఈ సిరీస్ని కూడా మళ్లీ నిర్వహిస్తారని సమాచారం తెలుస్తోంది.