Masters League 2025: క్రికెట్ మ్యాస్ట్రోలు తమ జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసుకున్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్ లీగ్ 2025 ప్రారంభ మ్యాచ్ లో శ్రీలంక మాస్టర్స్ జట్టును 4 పరుగుల తేడాతో ఓడించి ఇండియా మాస్టర్స్ జట్టు టోర్నమెంట్ ను గొప్పగా ప్రారంభించింది. ఉత్కంఠ రేపిన ఈ పోరులో చివరి ఓవర్ లో ఇండియా మాస్టర్స్ జట్టు కేవలం 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ఇదిలా ఉండగా.. రెండు జట్ల స్టార్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడడంతో ఈ మ్యాచ్ లో ఉత్కంఠకు కొదవ లేకుండా పోయింది.
రెండు ఫోర్లతో సచిన్ శుభారంభం
టాస్ గెలిచిన కుమార సంగక్కర నాయకత్వంలోని శ్రీలంక మాస్టర్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా.. సచిన్ టెండూల్కర్, అంబటి రాయుడు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. సచిన్ రెండు ఫోర్లు కొట్టి భారత్ కు శుభారంభాన్ని అందించాడు. కానీ వెంటనే వెనుదిరిగాడు. ఓపెనర్లు సచిన్ టెండూల్కర్(10), అంబటి రాయుడు(5) నిరాశపరిచినా.. స్టువర్ట్ బిన్నీ(68), యూసుఫ్ పఠాన్(56 నాటౌట్), గురుకీరత్ సింగ్(44), యువరాజ్(31 నాటౌట్).. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడడంతో భారత మాస్టర్స్ జట్టు 20 ఓవర్లలో 223 పరుగుల భారీ స్కోరును చేసింది.భారత బ్యాటర్లు శ్రీలంక బౌలర్లను కాస్త ఎక్కువగానే ఇబ్బంది పెట్టారు. యువరాజ్ సింగ్ తన పాత బ్యాటింగ్ శైలితోనే ఆడాడు. 22 బంతుల్లో 31 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. యువరాజ్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు.

సంగక్కర కెప్టెన్ ఇన్నింగ్స్
శ్రీలంక బౌలర్లలో సురంగ లక్మాల్ 2 వికెట్లను తీశాడు. అతను తప్ప మరే ఇతర బౌలర్ కూడా భారత బ్యాటర్ల నుంచి తప్పించుకోలేకపోయారు. అనంతరం కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు శ్రీలంక మాస్టర్స్ పెద్ద పోరాటమే చేసింది. కెప్టన్ సంగక్కర 30 బంతుల్లో 51 పరుగుల అద్భుతమైన బ్యాటింగ్ తో శ్రీలంక మాస్టర్స్ ను నడిపించాడు. లాహిరు తిరుమన్నే 17 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఇర్ఫాన్ పఠాన్ రాకతో ఆట మారిపోయింది. ఇర్ఫాన్ పఠాన్.. సంగక్కర, చతురంగ డి సిల్వా లాంటి దిగ్గజ ఆటగాళ్లను పెవిలియన్ కు చేర్చాడు. ఇర్ఫాన్ పఠాన్ మొత్తం 3 వికెట్లను పడగొట్టాడు.
చివరి ఓవర్ లో ఉత్కంఠ
ఎదురుదెబ్బలు ఎదురైనప్పటికీ అసెల గుణరత్నే(25 బంతుల్లో 37), జీవన్ మెండిస్(17 బంతుల్లో 42) ఆరో వికెట్ కు 68 పరుగుల భాగస్వామ్యంతో జట్టును పోటీలో నిలిపారు. అనంతరం ధావల్ కులకర్ణి వారి పార్టనర్ షిప్ ను విడగొట్టాడు. అనంతరం ఇసురు ఉదాన 7 బంతుల్లో 23 పరుగులు చేసి జట్టును విజయం వైపు మళ్లించాడు. కానీ వినయ్ కుమార్ నెమ్మదిగా బౌలింగ్ చేయడం ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వులు తెప్పించింది. చివరి ఓవర్ లో శ్రీలంకకు 6 బంతుల్లో 9 పరుగులు అవసరం. కానీ అభిమన్యు మిథున్ చక్కని బౌలింగ్ తో శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేసి భారత విజయగాథను లిఖించాడు. శ్రీలంక మాస్టర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ మూడు, ధావల్ కులకర్ణి, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.