
హైదరాబాద్: కొద్ది రోజులుగా విశ్రాంతిలో ఉన్న టీమిండియా బుధవారం మైదానంలోకి దిగింది. రెండు టీ-20ల సిరీస్లో భాగంగా ఐర్లాండ్తో బుధవారం మలహిదే స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ-20 మ్యాచ్లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. రోహిత్, ధావన్ల వీరోచిత ఇన్నింగ్స్, కుల్దీప్, చాహల్ల అద్భుతమైన బౌలింగ్తో టీం ఇండియా 76 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్ టీం ఇండియాకు 100వ మ్యాచ్ కావడం మరో విశేషం.
ఈ నేపథ్యంలో భారత జట్టు ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఆడిన 100 టీ20 మ్యాచ్లలో అత్యధిక మ్యాచ్లు గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది. ఆడిన 100 మ్యాచ్లలో భారత్ 62 మ్యాచ్లలో విజయం సాధించి అగ్రస్థానంలో ఉంది. కాగా ఈ జాబితాలో సౌతాఫ్రికా రెండో స్థానంలో ఉంది. 100వ మ్యాచ్ ఆడే సమయానికి సౌతాఫ్రికా 59 మ్యాచ్లలో విజయం సాధించింది.
ఆ తర్వాతి స్థానంలో ప్రస్తుతం టీ-20ల్లో నెం.1 స్థానంలో ఉన్న పాకిస్థాన్ ఉంది. పాక్ ఆడిన 100 మ్యాచుల్లో 58 మ్యాచుల్లో గెలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో 53 మ్యాచుల్లో విజయం సాధించి ఆస్ట్రేలియా, 51 మ్యాచుల్లో విజయం సాధించి శ్రీలంక నిలిచాయి. కాగా 100 అంతర్జాతీయ టీ-20లు ఆడిన 7వ జట్టుగా భారత్ ఘనత సాధించింది.
టీమిండియా శుక్రవారం ఐర్లాండ్తో అదే వేదికగా రెండో టీ20లోనూ తలపడనుంది.