
హైదరాబాద్: రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియాను 'బాస్' ఆఫ్ ది గేమ్ అంటూ అభివర్ణించాడు. నాగ్పూర్ వేదికగా ఆదివారం ముగిసిన మూడో టీ20లో దీపక్ చాహర్ ఆరు వికెట్లు తీయడంతో పాటు హ్యాట్రిక్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ ప్రదర్శనతో టీమిండియా మూడో టీ20లో 30 పరుగుల తేడాతో విజయం సాధించడంతో పాటు మూడు టీ20ల సిరిస్ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్లో "ఈ మ్యాచ్లో బాస్ ఎవరో భారత్ నిరూపించింది. ఈ సిరిస్లో తొలి గేమ్ను కోల్పోయినప్పటికీ... ఆ తర్వాత టీమిండియా అద్భుతంగా పుంజుకుంది" అని అన్నాడు.
"రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. అతడిలో గొప్ప టాలెంట్ ఉంది. అతను కోరుకున్నప్పుడల్లా పరుగులు చేయగలడు" అని అక్తర్ తెలిపాడు. ఈ సిరిస్లో రాజ్ కోట్ వేదికగా జరిగిన రెండో టీ20 రోహిత్ శర్మకు 100వ టీ20 అన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 43 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 85 పరుగులతో చెలరేగాడు.
"3వ టీ20 చూసేందుకు చాలా చాలా ఉత్సాహంగా ఉంటుందని నేను ముందే అనుకున్నా. ఏదేమైనా టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. అద్భుతంగా పోరాడిన బంగ్లాదేశ్కు హ్యాట్సాఫ్" అని అక్తర్ అన్నాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ20లో ముష్ఫికర్ రహీమ్ హాఫ్ సెంచరీతో రాణించడంతో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టీ20ల్లో టీమిండియాపై బంగ్లాదేశ్ గెలిచిన తొలి టీ20 ఇదే కావడం విశేషం. అంతకముందు ఆడిన ఎనిమిది టీ20ల్లోనూ బంగ్లాదేశ్ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టుని అక్తర్ ప్రత్యేకంగా అభినందించాడు. బంగ్లాదేశ్ జట్టు ఆర్డినరీ జట్టు కాదని, తనదైన రోజున ప్రత్యర్ది ఎవరైనా సరే ఓడిస్తుందని అన్నాడు. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు నవంబర్ 14న ఇండోర్ వేదికగా ప్రారంభం కానుంది.