
హైదరాబాద్: రెండున్నర నెలల ఇంగ్లాండ్ పర్యటనని టీమిండియా ఐర్లాండ్తో జరిగే టీ20 సిరిస్తో బుధవారం ప్రారంభించనుంది. రెండు టీ20ల సిరిస్లో భాగంగా ఐర్లాండ్ జట్టుతో టీమిండియా బుధవారం రాత్రి తొలి టీ20 మ్యాచ్ని ఆడనుంది. ఈ రెండు టీ20లకు డబ్లిన్ ఆతిథ్యమివ్వనుంది.
ఈ మ్యాచ్ టీమిండియాకు ఎంతో ప్రత్యేకం కానుంది. డబ్లిన్లోని మలహిదె క్రికెట్ క్లబ్ గ్రౌండ్ వేదికగా జరిగే ఈ టీ20 మ్యాచ్ టీమిండియాకు 100వది కావడం విశేషం. దీంతో ఈ మ్యాచ్ టీమిండియాకు ప్రతిష్టాత్మకంగా మారింది. రెండు టీ20ల సిరిస్ కోసం ఇప్పటికే కోహ్లీసేన డబ్లిన్ చేరుకుంది.
బుధవారం టీమిండియా ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ సెషన్లో కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ప్రాక్టీస్ సెషన్లో కెప్టెన్ కోహ్లీ, ధోని, బుమ్రా, రోహిత్ శర్మలతో పాటు పలువురు ఆటగాళ్లు పాల్గొన్నారు.
నిదాహాస్ ట్రోఫీ తర్వాత టీమిండియా ఆడుతోన్న ఈ మ్యాచ్ కావడంతో అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా బలమైన జట్టుతో బరిలోకి దిగనుంది. ఇప్పటివరకు ఐర్లాండ్తో టీమిండియా మూడు వన్డేలు, ఒక టీ20 ఆడగా అన్నింట్లోనూ టీమిండియాదే విజయం.
ఐర్లాండ్తో జరిగే ఈ సిరీస్ను గెలుచుకుని ఇంగ్లాండ్ పర్యటనను ఘనంగా ఆరంభించాలని కోహ్లీసేన చూస్తోంది. ఇంగ్లాండ్ సిరీస్కు ముందు ఐర్లాండ్ సిరీస్ను భారత్ చిన్నపాటి సన్నాహకంగా భావిస్తోంది. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీసేన టీ20ల్లో కూడా నంబర్వన్ స్థానంపై కన్నేసింది.
ఐర్లాండ్, ఇంగ్లాండ్తో జరిగే టీ20 సిరీస్ల్లో కోహ్లీసేన విజయం సాధిస్తే దాయాది దేశమైన పాకిస్థాన్ను వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు ఐర్లాండ్తో సిరీస్ను భారత్ తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఐర్లాండ్తో జరిగే తొలి టీ20లో ఓపెనర్లుగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు క్రీజులోకి రానున్నారు.
ఇక, మూడో స్థానంలో కోహ్లీ బ్యాటింగ్కు దిగే అవకాశం ఉంది. టీ20 సిరిస్కు రహానే ఎంపిక కానీ నేపథ్యంలో లోకేశ్ రాహుల్ నాలుగో స్థానం క్రీజ్లోకి రానున్నాడు. ఆ తర్వాత సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, ధోనీ, హార్థిక్ పాండ్యా ఇలా పటిష్టమైన బ్యాటింగ్ లైనప్తో బరిలోకి దిగనుంది. ఇక, బౌలింగ్ విషయానికి వస్తే భువీ, బుమ్రా, కుల్దీప్, చాహాల్లు ఉండనే ఉన్నారు.