
హైదరాబాద్: న్యూజిలాండ్ గడ్డపై టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన తర్వాత ప్రత్యర్థి చేతిలో వన్డేల్లో వైట్వాష్కు గురైన భారత జట్టు ఇప్పుడు టెస్టుల్లోనూ సున్నాతోనే పర్యటనను ముగించింది. సోమవారం హాగ్లీ ఓవల్ మైదానంలో ముగిసిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. ఫలితంగా 2-0తో సిరీస్ను సొంతం చేసుకుంది. అయితే టెస్ట్ ఫార్మాట్లో ప్రపంచ నంబర్వన్ అయిన కోహ్లీసేన కివీస్ చేతిలో దారుణంగా ఓడిపోవడంతో భారత మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మాజీ ఆటగాళ్లు బిషన్ బేడీ, వీవీఎస్ లక్ష్మణ్, ఆకాశ్ చోప్రా, సంజయ్ మంజ్రేకర్ కోహ్లీసేన ఓటమిపై స్పందించారు. 'ప్రపంచ నంబర్వన్ టెస్టు జట్టు భారత్పై కివీస్ ఎలా ఆధిపత్యం చెలాయించిందో ఎవరైనా చెప్పగలరా?. దీనిపై నేను సంశయిస్తున్నా. జట్టును దూషించకుండా సరళమైన భాషలో ఎవరైనా వివరిస్తారా?. కివీస్ ఎంతో ప్రశాంతంగా, పట్టుదలతో ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది' అని బేడీ ట్వీట్ చేశారు.
మంజ్రేకర్ మాట్లాడుతూ... 'టాప్ ఆర్డర్ను పెవిలియన్కు చేర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లే టెయిలెండర్లకు కూడా సరైన ప్రణాళికలు వేయాలి. బౌన్సర్ వేసి యార్కర్ వేస్తే టెయిలెండర్లు పెవిలియన్కు చేరరు. న్యూజిలాండ్లో భారత్కు సీమ్ కంటే స్వింగ్ చేసే బౌలర్లు ఎంతో అవసరం. స్వింగ్ అయ్యే పరిస్థితులను భారత బ్యాట్స్మెన్ ఎలా ఎదుర్కొంటారనే ప్రశ్నలు మళ్లీ మొదలయ్యాయి. ప్రపంచకప్లో సెమీఫైనల్ గుర్తుందా? భారత్ 5 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అక్కడ కూడా స్వింగ్కు అనుకూలించే పరిస్థితులే, అదే ప్రత్యర్థే' అని అన్నారు.
'భారత్ను ఓడించి సిరీస్ కైవసం చేసుకున్న న్యూజిలాండ్కు అభినందనలు. కోహ్లీసేన ఆటలో క్రమశిక్షణ చూపించలేకపోయింది. ఇది ఎంతో నిరాశ కలిగించే విషయం' అని లక్ష్మణ్ ట్వీట్ చేశారు. ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... 'కోహ్లీ సారథ్యంలో భారత జట్టు ఎన్నో విదేశీ పర్యటనల్లో రాణించింది. కానీ.. న్యూజిలాండ్ సిరీస్ మాత్రం భిన్నం. భారత్ కేవలం సిరీస్లో పాల్గొంది. బ్యాటింగ్లో, కివీస్ లోయర్ ఆర్డర్ను పెవిలియన్కు చేర్చడంలో విఫలమైంది' అని చెప్పుకొచ్చారు.