రేపటి నుంచే ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సీజన్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ సుదీర్ఘ విరామం తర్వాత లీగ్లో అడుగుపెట్టడం, అలాగే స్టార్ ప్లేయర్లు ఎంఎస్ ధోనీ, రిషభ్ పంత్ రీఎంట్రీ ఇవ్వనుండటంతో అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు ఎంతో ఐపీఎల్పై ఎంతో ఆసక్తికరంగా ఉన్నారు.
అయితే అందరి దృష్టి యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్పైనే ఉంటుందని దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు. 2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ ఆ తర్వాత ఆటకు దూరమైన విషయం తెలిసిందే. దాదాపు 15 నెలల తర్వాత అతడు రీఎంట్రీ ఇవ్వనున్నాడు. మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో బీసీసీఐతో పాటు విదేశీ క్రికెట్ బోర్డులు అతడిపై దృష్టిసారించాయి.

''ఈ ఢిల్లీ కుర్రాడి కోసం భారత్లో కొన్నివేల మంది ఎదురుచూస్తున్నారు. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా అతని రీఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. అందులో నేను కూడా ఒక్కడిని. అతని జెర్సీ నంబర్ 17. నేను కూడా 17 జెర్సీ నంబర్ను ఉపయోగించా. మా మధ్య ఈ అనుబంధం ఉంది. పంత్ ఆట చూడానికి ఎంతో ఇష్టపడతా. అతడు పునరాగమనం చేయనుండటం సంతోషంగా ఉంది. ఐపీఎల్లో అతడు ఇప్పటికే ఓ సెంచరీ సాధించాడు. ఈ సీజన్లో ఆ సంఖ్యను మూడు నుంచి నాలుగుకు పెంచుతాడు'' అని డివిలియర్స్ అన్నాడు.
కెప్టెన్సీ బాధ్యతలను పంత్కు ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి అప్పగించింది. పంత్ గైర్హాజరీలో ఢిల్లీని గత సీజన్లో డేవిడ్ వార్నర్ నడిపించాడు. కేవలం అయిదు విజయాలు సాధించిన ఢిల్లీ తొమ్మిదో స్థానంలో నిలిచింది. పంత్ రాకతో బలోపేతమైన ఢిల్లీ ఈ సీజన్లో సత్తాచాటాలని కసిగా బరిలోకి దిగుతోంది.
ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్), ప్రవీణ్ దూబె, డేవిడ్ వార్నర్, విక్కీ ఓస్త్వాల్, పృథ్వీ షా, అన్రిచ్ నోర్ట్జే, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మిచెల్ శర్మ, ఇషాంత్ శర్మ, యశ్ ధుల్, ముకేశ్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, రిచర్డ్సన్, సుమిత్ కుమార్, షై హోప్, స్వస్తిక్ చికార.