
ఆసియా కప్ కోసం పాకిస్తాన్కు తమ జట్టును పంపడం కుదరదని బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆసియా కప్ ఆతిథ్య హక్కులు పాకిస్తాన్కు దక్కాయి. అయితే రెండు దేశాల మధ్య సంబంధాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్కు పంపడం కుదరదని బీసీసీఐ ఖరాకండీగా చెప్పేసింది. దీనిపై పీసీబీ కూడా చాలా ఘాటుగా స్పందించింది. భారత్ కనుక ఇదే మొండిపట్టుతో ఆసియా కప్ను పాకిస్తాన్ నుంచి తరలించాలని చూస్తూ బాగోదని హెచ్చరించింది.
భారత్ కనుక తమ జట్టును పాకిస్తాన్కు పంపకుండా ఆసియా కప్ను బాయ్కాట్ చేస్తే.. తాము కూడా ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్ను బాయ్కాట్ చేస్తామని, పాకిస్తాన్ జట్టును భారత్కు పంపడం జరగదని హెచ్చరించింది. అయితే తాజాగా ఈ విషయంలో రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఐసీసీ, ఏసీసీ మధ్యవర్తిత్వం చేయడంతో కేవలం భారత్ ఆడే మ్యాచులను మాత్రమే తటస్థ వేదికలపై నిర్వహించడానికి పీసీబీ అంగీకారం తెలిపినట్లు సమాచారం.
ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ ఓపెనర్ నాజిర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భద్రత కారణాల వల్ల జట్టును పంపడం లేదని బీసీసఐ చెప్పడం శుద్ధ అబద్ధమని నాజిర్ ఆరోపించాడు. 'ఇది అసలు సెక్యూరిటీ రీజన్ కానే కాదు. పాకిస్తాన్కు ఇటీవలి కాలంలో ఎన్ని జట్లు వచ్చాయో చూడండి. అసలు ఎ-టీమ్స్ వదిలేయండి. ఆస్ట్రేలియా కూడా వచ్చింది. భారత్ రావడానికి ఏమైంది? ఇదంతా జస్ట్ కవర్ అప్ అంతే. ఇలా సెక్యూరిటీ అని చెప్పడం బీసీసీఐ వెతుక్కున్న సాకు. దమ్ముంటే ఇక్కడకు వచ్చి క్రికెట్ ఆడాలి. రాజకీయాలు చేయడం మొదలు పెడితే ఇక వెనక్కు తిరగడం జరగదు' అని నాజిర్ అన్నాడు.
పాకిస్తాన్ వచ్చి ఆడితే ఆసియా కప్ గెలవేలమని భారత్ భయపడుతోందని, అందుకే భద్రతను సాకుగా చూపించి తప్పించుకుంటోందని నాజిర్ సంచలన ఆరోపణలు చేశాడు. భారత జట్టు చివరగా 2008లో ఆసియా కప్ కోసమే పాక్కు వెళ్లింది. ఆ టోర్నీలో ఫైనల్ చేరిన టీమిండియా.. చివర్లో శ్రీలంక చేతిలో 100 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత ముంబై ఉగ్రదాడి నేపథ్యంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత 2012-13లో పాకిస్తాన్ జట్టు భారత్లో పర్యటించింది. అప్పటి నుంచి మళ్లీ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీసులు జరగడం లేదు.