
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(50 బంతుల్లో 94; 6 ఫోర్లు, 6 సిక్సులు), ఓపెనర్ కేఎల్ రాహుల్(40 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో వెస్టిండిస్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఫలితంగా మూడు టీ20ల సిరిస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది.భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జట్టు స్కోరు 30 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ(8) వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ మరో ఓపెనర్ కేఎల్ రాహుల్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. సాధించాల్సిన రన్రేట్ ఎక్కువగా ఉన్నా.. ఎలాంటి ఆందోళనకు గురికాకుండా నిలకడగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ బౌండరీల మోత మోగించారు.
విలియమ్స్ వేసిన 16వ ఓవర్లో 23 పరుగులు రావడంతో టీమిండియా విజయం ఖాయమైంది. కాగా, మిడిలార్డర్లో రిషబ్ పంత్(18) ఫరవాలేదనిపించగా, శ్రేయాస్ అయ్యర్(4) నిరాశపరిచాడు.
టీమిండియా విజయ లక్ష్యం 208
తొలి టీ20లో వెస్టిండిస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన వెస్టిండిస్ జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడటం ప్రారంభించింది. ఈ క్రమంలో 13 పరుగుల వద్ద ఓపెనర్ సిమన్స్ (2) వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ ఎవిన్ లూయిస్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 40 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో ఔటయ్యాడు.
చివర్లో కెప్టెన్ కీరన్ పొలార్డ్ 19 బంతుల్లో 1 ఫోర్, నాలుగు సిక్సర్లతో 37 పరుగుల వరద పారించాడు. దూకుడుగా ఆడే క్రమంలో పొలార్డ్ జట్టు స్కోరు 173 పరుగుల వద్ద చాహల్ బౌలింగ్లో ఔటయ్యాడు. చివర్లో జాసన్ హోల్డర్(9 బంతుల్లో 24) పరుగులతో మెరవడంతో విండిస్ స్కోరు 200 దాటింది.
వెస్టిండిస్ ఇన్నింగ్స్లో మొత్తం 15 సిక్సర్లు నమోదయ్యాయి. భారత బౌలర్లలో యజువేంద్ర చాహాల్ రెండు వికెట్లు తీయగా... వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, రవీంద్ర జడేజాలకు తలో వికెట్ లభించింది. అంతకముందు టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.