
హైదరాబాద్: మంగళవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చరిత్రాత్మక ప్రకటన చేసింది. మంగళవారం ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారులతో సమావేశమైన బీసీసీఐ అధికారులు ఆఫ్గానిస్తాన్తో ఈ ఏడాది జూన్లో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనున్నట్లు పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ చారిత్రాత్మక టెస్టు మ్యాచ్కి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టెస్టు జూన్ 14-18 వరకు జరుగనుంది. ఐపీఎల్ 11వ సీజన్ ముగిసిన తర్వాత ఈ టెస్ట్ మ్యాచ్ జరుగనుంది.
ఆప్ఘనిస్థాన్ జట్టుకు ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. గతేడాది జూన్లో ఆప్ఘనిస్థాన్, ఐర్లాండ్ జట్లకు ఐసీసీ టెస్టు హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వెలువడిన తర్వాత బీసీసీఐ ఆప్ఘనిస్థాన్తో భారత్ జట్టు తొలి టెస్టు మ్యాచ్ ఆడుతుందని అధికారికంగా ప్రకటన కూడా చేసింది.
ఆ ప్రకటన ప్రకారం ఇరు దేశాల మధ్య తొలి టెస్టును ఈ ఏడాది జూన్లో నిర్వహించనుంది. ఈ మేరకు మంగళవారం అధికారిక ప్రకటన చేసింది. ఈ టెస్టు మ్యాచ్ అనంతరం ఐర్లాండ్, ఇంగ్లాండ్ దేశాల పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. గతంలో 2014 ఏసియా కప్లో, ఆ తర్వాత 2015 వరల్డ్కప్ టోర్నీలో భారత్తో ఆఫ్గాన్ తలపడింది.
ఇప్పటికే ఆప్ఘనిస్థాన్ జట్టుకు చెందిన రషీద్ ఖాన్, మహమ్మద్ నబీలు గతేడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడిన సంగతి తెలిసిందే. ఇక, ఐపీఎల్ 2018 కోసం నిర్వహించే వేలంలో ఆప్ఘనిస్థాన్ కు చెందిన 13 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.