
న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్ ఎంపిక ప్రక్రియ కొంచెం ఆలస్యం కానుంది. కోచ్ ఎంపిక ప్రక్రియ స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15) తర్వాతే జరిగే అవకాశాలున్నాయి. ఎన్నో సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా.. అర్హులైన సుమారు ఆరుగురికి ఈ నెల 13, 14వ తేదిల్లో ఇంటర్వ్యూలు నిర్వహించాలని ముందు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే అవసరమైన పత్రాలు సిద్ధంకాని నేపథ్యంలో ఆగస్టు 15 తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది.
కపిల్దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామితో కూడిన క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏవో) ఆధ్వర్యంలో టీమిండియా హెడ్ కోచ్ ఎంపిక జరగనుంది. అయితే సీఏవోకు అవసరమైన ప్రాథమిక ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఎంపిక ప్రక్రియ కాస్త ఆలస్యమవుతున్నట్లు ఓ అధికారి తెలిపారు. 'ఈ సమావేశం ముందుగా ఆగస్టు 13,14 తేదీలలో జరగాల్సి ఉంది. ప్రధాన కోచ్ పదవికి వచ్చిన దరఖాస్తుల్లో ఆరుగురిని ఇంటర్వ్యూకు ఎంపిక చేశాం. కానీ కమిటీకి ఇచ్చే పేపర్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. దీని కారణంగానే కాస్త ఆలస్యమవుతుంది. ఇంటర్వ్యూలు చేయడానికి కేవలం ఒకరోజు సరిపోతుంది. ఆగస్టు 15 లోపు కోచ్ ఎంపిక ప్రక్రియ జరగడం లేదు' అని ఓ అధికారి తెలిపారు.
'కోచ్ పదవికి ఎవరు సరిపోతారనే దానిపై స్పష్టంగా మార్గదర్శకాలు ఉన్నాయి. ముగ్గురు సభ్యుల కమిటీ ప్రధాన కోచ్ అభ్యర్థిని ఎంపిక చేస్తారు. ఇందులో కెప్టెన్ కోహ్లీకి ఎటువంటి పాత్ర లేదు. మహిళా కోచ్ను నియమించేటప్పుడు అనుసరించిన విధానాన్నే ఇప్పుడు కూడా అనుసరిస్తారు. సీఏవో కమిటీ టాప్ ముగ్గురి జాబితాను బీసీసీఐకి అందిస్తుంది. జాబితాలో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తిని బీసీసీఐ సంప్రదిస్తుంది. ఆ వ్యక్తికి అన్ని విధాలా అర్హుడైతే.. కోచ్ పదవి పొందుతాడు. లేదంటే జాబితాలో రెండవ స్థానంలో ఉన్న వ్యక్తిని సంప్రదిస్తారు. రవి కోచ్గా కొనసాగుతున్నట్లయితే చాలా సంతోషం. కాని నా సలహాను ఎవరూ అడగలేదు. ఎంపిక ప్రక్రియలో ఏం జరుగుతుందో తెలియదు' అని ఆ అధికారి పేర్కొన్నాడు.