హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు స్వదేశంలో ఇంగ్లాండ్పై జరిగిన వన్డే సిరిస్ను టీమిండియా గెలుచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. రెండేళ్ల తర్వాత టీమిండియాలో పునరాగమనం చేసి సత్తా చాటుతున్న కేదార్ జాదవ్పై గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు.
అద్భుతమైన మ్యాచ్ ఫినిషింగ్ లక్షణాలున్న జాదవ్కు ఆరోస్ధానికి అతికినట్లు సరిపోతాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. చాలాకాలం తర్వాత ఆరోస్ధానంలో భారత్కు లభించిన ఆణిముత్యం కేదార్ జాదవ్ అంటూ సునీల్ గవాస్కర్ కొనియాడాడు.
'ఆరోస్థానానికి జాదవ్కు చక్కగా సరిపోతాడు. ఒక ఆణిముత్యం లాంటి క్రికెటర్ను భారత్ చాలాకాలం తర్వాత వెతికిపట్టిందని అనుకుంటున్నా. జాదవ్ బంతిని హిట్ చేసే విధానం చాలా బాగుంది. కచ్చితమైన షాట్లతో భారత్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు ' అని గవాస్కర్ తెలిపాడు.
ఇక ధోని నుంచి కెప్టెన్సీ పగ్గాలను చేపట్టిన తర్వాత కోహ్లీ తన తొలి సిరిస్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసందే. దీనిపై కూడా గవాస్కర్ స్పందించాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్గా టీమిండియాకు బాధ్యతలు చేపట్టిన కోహ్లికి అదేమీ భారం కాదని చెప్పాడు.
కెప్టెన్సీ బాధ్యతలు కోహ్లీ బ్యాటింగ్పై ఎటువంటి ప్రభావం చూపదని గవాస్కర్ తెలిపాడు. ధోని నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత తన తొలి వన్డే సిరిస్లో కెప్టెన్గా తన సత్తా ఏంటో చూపించాడు. ఇంగ్లాండ్తో ముగిసిన వన్డే సిరిస్లో ఓ సెంచరీతో పాటు అర్ధసెంచరీ చేసి అభిమానులను అలరించాడు.