తొలి ఇన్నింగ్స్ను 443/7 వద్ద డిక్లేర్
ఆసీస్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ను 443/7 వద్ద డిక్లేర్ చేసింది. తొలి రోజు నుంచే బ్యాటింగ్ జోరు కొనసాగించిన టీమిండియా భారీ స్కోరును సాధించింది. భారత ఇన్నింగ్స్లో చతేశ్వర్ పుజారా (106) పది ఫోర్ల సాయంతో 319 బంతులను ఎదుర్కొని సెంచరీకి మించిన స్కోరు చేశాడు. విరాట్ కోహ్లి(82), మయాంక అగర్వాల్(76), రోహిత్ శర్మ(63 నాటౌట్)లు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.
పిచ్ వేగాన్నీ తట్టుకోలేకపోయా
‘పిచ్పై పరుగులు చేయడం కష్టంగా ఉంది. తొలి 2 రోజుల్లో చేసిన పరుగులు చాలా తక్కువ. ఒకే రోజులో 200 చేయడం కష్టమైన పని. ఈ ప్రకారం భారీ స్కోరు చేసినట్టే భావిస్తున్నా. పిచ్ క్రమంగా జీవం కోల్పోతోంది. అసహజంగా బౌన్స్ అవుతోంది. ఈ క్రమంలో రెండో రోజుకే భారీ తేడా కనిపించింది. మూడో రోజు నుంచి బ్యాటింగ్ చేయడం ఎంతో కష్టం. మా బౌలర్లు అద్భుతంగా బంతులు వేస్తున్నారు. ప్రత్యర్థి బ్యాటింగ్ చేసేటప్పుడు మాత్రం కచ్చితంగా తంటాలుపడతారు. నేనైతే పిచ్ వేగాన్నీ తట్టుకోలేకపోయా. నాలుగైదు బంతులు చేతి వేళ్లను తాకాయి. అవి షార్ట్పిచ్ బంతులూ కావు.
ఆసీస్ అపసోపాలు పడాల్సిందే
తక్కువ బౌన్స్తో ఇబ్బంది లేదు. బౌన్స్లో వైవిధ్యం ఉంటే మాత్రం ఏం చేయలేం. కమిన్స్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వైవిధ్యంగా బౌన్స్ చేశాడు. మా బౌలింగ్ యూనిట్ బలంగా ఉంది కాబట్టి.. పరుగులు చేయడం అంత ఈజీ కాదు. మూడో రోజు నుంచి పిచ్ మరింత ప్రమాదకరంగా మారడం ఖాయం. తొలి ఇన్నింగ్స్లో మాకు సరిపోయేంత స్కోరును బోర్డుపై ఉంచాం. కానీ, ఆసీస్ పరుగులు సాధించడానికి అపసోపాలు పడాల్సిందే' అని పుజారా అన్నాడు.
అత్యధిక బౌలర్లు ఎదుర్కొన్న బ్యాట్స్ మన్గా
అయితే 2017 జనవరి నుంచి చూస్తే టెస్టు క్రికెట్లో అత్యధిక బంతుల్ని ఎదుర్కొన్న ఏకైక ఆటగాడిగా పుజారా గుర్తింపు సాధించాడు. దాదాపు ఏడాది కాలంలో టెస్టు క్రికెట్లో పుజారా ఎదుర్కొన్న బంతులు 4 వేలకు పైగానే ఉన్నాయి. ఫలితంగా ప్రపంచ క్రికెట్లో అత్యధిక బంతులను ఆడిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. సెంచరీ సాధించిన పుజారా మ్యాచ్లో విరాట్ (82)తో కలిసి 170 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించాడు.