హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ఆరంభమయ్యే వన్డే వరల్డ్కప్ గెలిచే సత్తా భారత్ వద్ద ఉందని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నారు. ఇంగ్లాండ్ పరిస్థితులకు తగ్గ జట్టుని ఎంపిక చేస్తామని అన్నాడు. వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్న విజయ్ శంకర్ నాలుగో స్థానంలో ఆడతాడా? అన్న ప్రశ్నకు రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు.
"మనకు అద్భుతమైన జట్టు ఉంది. అంతేకాదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగల క్రికెటర్లు భారత జట్టులో ఉన్నారు. అంతేకాదు నెంబర్. 4 స్థానంలో ఆటగల బ్యాట్స్మెన్ సైతం ఉన్నారు. ప్రస్తుతం దాని గురించే అస్సలు ఆలోచించడం లేదు" అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
"వరల్డ్కప్ జట్టుకు ఎంపికైన 15 మంది ఆటగాళ్లలో ఇచ్చిన సమయంలో ఎప్పుడైనా ఆడగలరు. ఎవరైనా ఫాస్ట్ బౌలర్ గాయపడితే అతడి స్థానంలో వేరొకరిని ఎంపిక చేస్తాం. అదృష్టవశాత్తు కేదార్కు ఫ్రాక్చర్ కాలేదు. అతడిని కొన్ని రోజుల పాటు పరిశీలనలో ఉంచుతున్నాం. 22న ఇంగ్లాండ్ పయనమవుతాం. అప్పటివరకు మరొకరి ఎంపికపై ఇప్పుడే ఆలోచించడం లేదు" అని రవిశాస్త్రి అన్నాడు.
"వరల్డ్కప్ లాంటి మెగాటోర్నీలో ఏ జట్టూ ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోదు. పరిస్థితులను బట్టి ఆడాల్సి ఉంటుంది. నాలుగేళ్లలో ఇలాంటి పరిస్థితులెన్నో చూశాం. ఒత్తిడిని అనుభవించాం. వరల్డ్కప్లో ఆస్ట్రేలియా, వెస్టిండిస్ జట్లు ఏమైనా చేయగలవు. భారత్లో ఆడినప్పుడు వెస్టిండిస్ జట్టు గట్టి పోటీనిచ్చింది" అని శాస్త్రి అన్నాడు.
"అప్పుడు ఆ జట్టులో క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ లేరు. వీరిద్దరి రాకతో ఇప్పుడు ఆ జట్టు కూడా బలంగా కనిపిస్తోంది. ఆ జట్టులోని ఆటగాళ్ల పవర్ హిట్టింగ్ సామర్థ్యం గురించి అందరికీ తెలిసిందే. ఇక, డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆసీస్ను ఎన్నడూ తక్కువ అంచనా వేయొద్దు. గత 25 ఏళ్లలో ఏ జట్టు గెలవని ట్రోఫీలను ఆ జట్టు సొంతం చేసుకుంది. మళ్లీ నాణ్యమైన సీనియర్ ఆటగాళ్లు రావడంతో ఆ జట్టు బలంగా కనిపిస్తోంది" అని శాస్త్రి అన్నాడు.