సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో భారత్ పోరాడుతోంది. ఓవర్నైట్ స్కోర్ 256/5తో ఇవాళ ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా నిలకడగా పరుగులు సాధిస్తుంది. 140 పరుగులతో క్రీజులోకి వచ్చిన డీన్ ఎల్గర్ (185) డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. మరోవైపు మార్కో జేన్సన్ (72*) శతకం దిశగా అడుగులు వేస్తున్నాడు.
అయితే టీమిండియా ప్లేయర్లు మైదానంలో నీరసంగా, నిరాశగా కనిపిస్తున్నారు. సెంచూరియన్లో సూర్యుడు తన ప్రతాపం తీవ్రంగా చూపిస్తున్నాడు. భానుడి ఎఫెక్ట్కు భారత ఆటగాళ్లు అలసిపోతున్నారు. బౌలర్లు బౌలింగ్ చేసే ముందు ఎప్పటిలా ఇతర ఆటగాళ్ల నుంచి ప్రోత్సాహం లభించట్లేదు. చాలా సాధారణంగా భారత ప్లేయర్లు నిశబ్ధంగా మైదానంలో ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో కామెంటరీగా వ్యవహరిస్తున్న దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టీమిండియాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. ఉదయం నుంచి భారత జట్టు చాలా నీరసంగా ఉందని అన్నాడు. టీమిండియా మరింత శక్తితో ఉండాలని చెప్పాడు. నెట్టింట్లో గవాస్కర్ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. భారత్ శక్తిని చూపించాలని టీమిండియాకు మద్దతుగా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
మరోవైపు టీమిండియా బుమ్రా, సిరాజ్పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ప్రసిధ్ కృష్ణ విఫలమవుతున్నాడు. ఎల్గర్ వికెట్ను శార్దూల్ ఠాకూర్ తీసినప్పటికీ పరుగులు సమర్పించుకుంటున్నాడు.ఎల్గర్ ఔటవ్వడంతో జేన్సన్ దూకుడుగా ఆడుతున్నాడు. శార్దూల్ బౌలింగ్లో వరుస బౌండరీలు బాదాడు. అయితే లంచ్ విరామానికి ముందు చివరి ఓవర్ వేసిన అశ్విన్ వికెట్ సాధించాడు. కొయెట్జీ (19) షాట్కు యత్నించి సిరాజ్ చేతికి చిక్కాడు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి 392 పరుగులు చేసింది. క్రీజులో జేన్సన్, రబాడ ఉన్నారు.
అయితే ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా ఇంకా బ్యాటింగ్కు రాలేదు. ప్రస్తుతం సఫారీసేన తొలి ఇన్నింగ్స్లో 147 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమిండియా పోటీలోకి రావాలంటే దక్షిణాఫ్రికాను వీలైనంత తొందరగా ఆలౌట్ చేయాలి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 245 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (101) శతకం సాధించాడు.