ప్రాక్టీస్ సెషన్లో ఇంగ్లాండ్ జట్టు
వాస్తవానికి శనివారం ఇంగ్లాండ్ జట్టు అధికారికంగా ప్రాక్టీసు సెషన్లో పాల్గొనాల్సి ఉంది. అయినప్పటికీ శుక్రవారం కూడా జట్టు ఆటగాళ్లంతా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనడం విశేషం. బంగ్లాదేశ్తో మిర్పూర్లో జరిగిన రెండో టెస్టు మూడు రోజుల్లోనే ముగియడంతో ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి లభించింది. అందుకే శుక్రవారం ఆప్షనల్ అయినా జట్టు ఆటగాళ్లంతా నెట్స్లో సందడి చేశారు.
ఆదివారం రాజ్కోట్కు కుక్ సేన
కాగా ఈ శనివారం నాడు పూర్తి స్థాయిలో ఇంగ్లాండ్ జట్టుకు చెందిన 16 మంది ఆటగాళ్లు నెట్స్లో ప్రాక్టీసు చేయనున్నారు. ఇక ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం ఇంగ్లాండ్ జట్టు ఆదివారం రాజ్కోట్కు బయల్దేరుతుందని జట్టు వర్గాలు వెల్లడించాయి. భారత్తో జరిగే టెస్టు సిరిస్లో స్ఫిన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు 12 మంది స్థానిక స్పిన్ బౌలర్లతో ఇంగ్లండ్ ఆటగాళ్లు తీవ్రంగా సాధన చేశారు. ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ జో రూట్ వీరి బౌలింగ్లో స్లాగ్, స్వీప్, స్ట్రెయిట్ డ్రైవ్లపై ఎక్కువగా దృష్టి సారించాడు.
తొలి టెస్టుకు జేమ్స్ ఆండర్సన్ దూరం
ఇక భుజం నొప్పితో బాధపడుతున్న ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఇప్పటికే బంగ్లాదేశ్ పర్యటన మిస్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా భారత్తో జరగనున్న తొలి టెస్టుకు కూడా అందుబాటులో ఉండడం లేదని ఈసీబీ ప్రకటించింది. నవంబర్ 9 నుంచి రాజ్ కోట్లో ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ముందు కుక్ సేన అక్కడ రెండు రోజుల పాటు ప్రాక్టీస్ చేయనుంది.
భారత-ఇంగ్లాండ్ టెస్టు సిరిస్లో తొలిసారి డీఆర్ఎస్ అమలు
భారత-ఇంగ్లాండ్ టెస్టు సిరిస్లో తొలిసారి ప్రయోగాత్మకంగా డీఆర్ఎస్ను అమలు చేయనున్నట్లు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుకు బీసీసీఐ చేతులెత్తేసింది! భారత్లో పర్యటన ముగిసే వరకు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఖర్చులు భరించలేమని, మీవి మీరే చూసుకోవాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు లేఖ రాసింది.
చేతులెత్తేసిన బీసీసీఐ
లోధా కమిటీ సిఫార్సుల అమలు పైన సుప్రీం కోర్టు ఆదేశాలతో బీసీసీఐ ఇరుకున పడింది. ఇందులో భాగంగా బీసీసీఐ సెక్రటరీ అజయ్ షిర్కే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు లేఖ రాశారు. అసౌకర్యానికి బోర్డు తరఫున క్షమాపణలు తెలుపుతున్నానని అన్నారు. హోటల్, ప్రయాణ ఖర్చులను మీ బోర్డే పెట్టుకోవాలని అందులో కోరారు.
భారత్ సిరిస్ యధావిధిగా జరుగుతుంది: ఈసీబీ
భారత్తో జరిగే టెస్టు సిరీస్కు వచ్చిన ప్రమాదమేమీ లేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్పష్టం చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్ల పర్యటన ఖర్చులను భరించుకోవాల్సిందిగా బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే రాసిన లేఖపై ఈసీబీ స్పందించింది. ‘మేం ప్రస్తుతం భారత్లోనే ఉన్నాం. ఇప్పుడు మా ప్రణాళికల్లో ఎలాంటి మార్పు లేదు. సిరీస్ కోసమే ఎదురుచూస్తున్నాం' అని ఈసీబీ అధికార ప్రతినిధి తెలిపారు.