
ముంబై: టీమిండియా టాపార్డర్ సూపర్. ఎంతో బలంగా ఉంది. నాలుగో స్థానంలో మనకు బ్యాట్స్మన్ అవసరం లేదు అని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సరదాగా అన్నాడు. భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన ట్వీట్కు యువరాజ్ ఇలా ఫన్నీగా సమాధానం ఇచ్చాడు. తాజాగా వన్డేల్లో నాలుగో స్థానంలో యువ ఆటగాడు సంజు శాంసన్కు అవకాశం ఇవ్వాలని భజ్జీ ట్విట్టర్ ద్వారా కోరాడు.
'వన్డేల్లో నాలుగో స్థానంలో సంజు శాంసన్కు ఎందుకు అవకాశం ఇవ్వకూడదు. అతడికి మంచి టెక్నిక్, సామర్థ్యం ఉంది. దక్షిణాఫ్రికా-ఎ జట్టుపై అద్భుతంగా రాణించాడు. ఈ స్థానంలో అతన్ని పరీక్షించితే మంచి ఫలితం రావొచ్చు' అని భజ్జీ ట్వీట్ చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే యువరాజ్ తనదైన శైలిలో బదులిచ్చాడు. 'మన టాపార్డర్ సూపర్ బ్రో. మనకు నాల్గో స్థానంలో బ్యాట్స్మన్ అవసరం లేదు' అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ ఏడాది జూన్లో యువరాజ్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
టీమిండియా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నా.. వన్డేల్లో నాల్గో స్థానానికి ఇంకా సరైన సమాధానం దొరకలేదు. వన్డేల్లో గత రెండేళ్ల నుంచి నాలుగో స్థానం బ్యాట్స్మన్ సమస్య అలానే ఉంది. ఇటీవల జరిగిన ప్రపంచకప్లో మిడిలార్డర్ వైఫల్యం కారణంగానే సెమీస్ ఓడిపోయాం. మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ నాలుగో స్థానంలో కచ్చితమైన ఆటగాడ్ని వెతకడంలో విఫలం కావడం కూడా అతనిపై వేటుకు ప్రధాన కారణం. ఇప్పుడు కొత్త బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మరి ఈ స్థానంపై ఎంతవరకూ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.
వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో రిషబ్ పంత్ నాలుగో స్థానంలో వచ్చి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఐదో స్థానంలో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి శ్రేయస్ పడింది. భారత మాజీలు సైతం నాలుగులో శ్రేయస్కు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇక ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా సిరీస్లో నాలుగో స్థానంలో ఎవరికి అవకాశం ఇస్తారో అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.