
హైదరాబాద్: న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్లో యువ భారత్ సత్తా చాటుతోంది. వరుసగా రెండో విజయంతో పృథ్వీ షా నేతృత్వంలోని భారత జట్టు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం తమ గ్రూప్ 'బి'లో భాగంగా పపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
టోర్నీలో భాగంగా జనవరి 19న తమ చివరి గ్రూప్ మ్యాచ్లో జింబాబ్వేతో తలపడుతుంది. పపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ పృథ్వీ షా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా భారత బౌలర్ల ధాటికి 21.5 ఓవర్లలో కేవలం 64 పరుగులకే కుప్పకూలింది.
ఒవియా సామ్ (15), సిమోన్ అతాయ్ (13), సినక అరువా (12) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. నలుగురు బ్యాట్స్మెన్ డకౌట్ అయ్యారు. భారత స్పిన్నర్ రాయ్ ధాటికి మూడు పరుగుల వ్యవధిలో పపువా న్యూ గినియా చివరి ఆరు వికెట్లను కోల్పోయింది.
అనంతరం స్వల్ప ఛేదన కోసం బరిలోకి దిగిన భారత్ 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసి విజయం సాధించింది. కెప్టెన్ పృథ్వీషా (39 బంతుల్లో 12 ఫోర్లతో 57 నాటౌట్) మరో హాఫ్ సెంచరీ చేయగా... మన్జ్యోత్ కాల్రా (9 నాటౌట్) అతనికి అండగా నిలిచాడు.