దుబాయ్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్ ఏకపక్షంగా ముగిసింది. దుబాయ్ ఐసీసీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో పాకిస్థాన్ యువ జట్టు అద్భుతంగా ఆడి భారత యువ జట్టును 191 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించి ఆసియా ఛాంపియన్గా అవతరించింది. భారత్పై పాకిస్థాన్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో పీసీబీ ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్టేడియంలోని వీఐపీ స్టాండ్స్ నుంచి మ్యాచ్ను వీక్షించిన ఆయన.. పాక్ ఆటగాళ్లు వికెట్లు తీస్తున్నప్పుడల్లా ఎంతో ఉత్సాహంగా కనిపించారు.
గత సెప్టెంబర్లో సీనియర్ ఆసియా కప్లో భారత్ గెలిచినప్పుడు ట్రోఫీ ప్రధానంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. కానీ ఈ సారి తన సొంత దేశం విజయం సాధించడంతో మొహ్సిన్ నఖ్వీ స్వయంగా మైదానంలోకి వచ్చి ఆటగాళ్లతో కలిసి విక్టరీ లాప్లో పాల్గొన్నారు. "ఇది చారిత్రాత్మక విజయం. సమీర్ మిన్హాస్ ఇన్నింగ్స్ అద్భుతం. పాక్ యువ ఆటగాళ్లు దేశం గర్వించేలా చేశారు" అని మొహ్సిన్ నఖ్వీ ఎక్స్ వేదికగా కొనియాడారు.

భారత్ను చిత్తు చేసిన పాకిస్థాన్
ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో పాకిస్థాన్ 191 పరుగుల భారీ తేడాతో భారత్ను ఓడించి టైటిల్ను కైవసం చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 347 పరుగులు చేసింది. పాకిస్థాన్ ఓపెనర్ సమీర్ మిన్హాస్ కనీవినీ ఎరుగని ఇన్నింగ్స్తో పునాది వేశాడు.
కేవలం 113 బంతుల్లో 172 పరుగులు చేసిన సమీర్.. భారత్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతని ఇన్నింగ్స్లో 17 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు ఉన్నాయి.అండర్-19 ఆసియా కప్ ఫైనల్ చరిత్రలోనే ఇది అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. దీనివల్ల పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోరు సాధించింది.
348 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత యువ జట్టు, పాక్ పేసర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. అలీ రజా 4 వికెట్లతో భారత్ వెన్నుముక విరవగా.. మహమ్మద్ సయ్యమ్, అబ్దుల్ సుభాన్ చెరో రెండు వికెట్లతో రాణించారు. భారత జట్టు కేవలం 26.2 ఓవర్లలోనే 156 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో ఎవరూ కూడా కనీసం పోరాట పటిమను ప్రదర్శించలేకపోయారు.
మొహ్సిన్ నఖ్వీ రియాక్షన్ ఇదే..
మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టాండ్స్ నుంచి మొహ్సిన్ నఖ్వీ చిరునవ్వుతో జట్టును ఉత్సాహపరుస్తూ కనిపించారు. భారత్ వికెట్లు టపాటపా రాలుతున్న సమయంలో ఆయన ముఖంలో విజయోత్సాహం స్పష్టంగా కనిపించింది. ఏసీసీ అధ్యక్షుడిగా మొహ్సిన్ నఖ్వీ విజేతలకు ట్రోఫీని అందజేశారు. అంతకుముందు సెప్టెంబర్లో సీనియర్ ఆసియా కప్ సమయంలో భారత్ విజయం సాధించినప్పుడు ట్రోఫీ ప్రదానంలో కొన్ని వివాదాలు తలెత్తాయి. కానీ ఈసారి తన సొంత జట్టు గెలవడంతో ఆయన స్వయంగా వేడుకల్లో పాల్గొన్నారు. "భయం లేని క్రికెట్, అసమానమైన స్ఫూర్తి! మన అండర్-19 జట్టుకు ట్రోఫీ అందించడం గర్వంగా ఉంది," అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 172 పరుగులతో రికార్డు సృష్టించిన సమీర్ మిన్హాస్ను మొహ్సిన్ నఖ్వీ ప్రత్యేకంగా అభినందించారు.