
న్యూ ఢిల్లీ: అండర్-19 ఆసియాకప్లో భారత్ భారీ విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో యువ భారత జట్టు 227 పరుగుల తేడాతో యూఏఈని ఓడించింది. ఓపెనర్లు దేవ్దత్ పడిక్కల్ (121), అనూజ్ రావత్ (102) శతకాలతోపాటు బౌలింగ్లో సిద్దార్థ్ దేశాయ్ (6/24) ఆరు వికెట్లతో యూఏఈపై చెలరేగి ఆడారు.
అండర్-19 ఆసియాకప్ గ్రూప్-ఎలో ఆదివారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 354 పరుగుల భారీ స్కోరు చేసింది. రావత్, పడిక్కల్ తొలి వికెట్కు 205 పరుగుల భాగస్వామ్యంతో భారీ స్కోరుకు పునాది వేశారు. కెప్టెన్ పవన్ షా (45), సమీర్ చౌధురి (42), ఆయుష్ బడౌని (21) స్కోరు బోర్డును పరుగెత్తించారు.
ఛేదనలో యూఏఈ 33.5 ఓవర్లలో 133 పరుగులకే ఆలౌటైంది. సిద్ధార్థ్ దేశాయ్ 8.5 ఓవర్లు బౌలింగ్ వేసి (6/24) ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. యూఏఈ జట్టులో అలీ మీర్జా (41) టాప్ స్కోరర్గా నిలిచాడు. అతనితో పాటుగా ఫిగ్గీ జాన్ మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.
ఇదే టోర్నీలో భాగంగా ఇంతకుముందు జరిగిన మ్యాచ్లలో శ్రీలంక జట్టు హాంకాంగ్ను 10 వికెట్ల తేడాతో చిట్టగ్యాంగ్ వేదికగా ఓడించింది. గ్రూప్ ఏ లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో భారత జట్టు నేపాల్ను 171 పరుగుల తేడాతో ఓడించింది.