న్యూఢిల్లీ: టీమ్ఇండియా పేసర్ మహమ్మద్ షమి తనకు భద్రత కోసం గన్మన్ను నియమించాలని అమ్రోహ జిల్లా మేజిస్ట్రేట్ను కోరాడు. వ్యక్తిగత జీవితంలో సమస్యల కారణంగా తనకు భద్రత కల్పించాలని విన్నవించాడు. షమి విన్నపాన్ని పరిశీలించిన జిల్లా మేజిస్రేట్ హేమంత్ కుమార్ గన్మన్ను నియమించడానికి కావలసిన ప్రక్రియలను పూర్తి చేసి దరఖాస్తు సమర్పించాలని తెలిపాడు.
దాదాపు పది ఎనిమిది నెలల క్రితం మొదలైన భార్యాభర్తల వివాదం ఇప్పటికీ ఓ కొలిక్కి రాకపోవడంతో షమీ తలమునకలయ్యే సమస్యలతో బాధపడతున్నాడు. తన భార్య హాసిన్ జహాన్తో వ్యవహారం షమికి తలనొప్పిగా మారింది. తనను హింసిస్తున్నాడని, చంపేందుకు ప్రయత్నించాడని, మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని షమిపై జహాన్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఆ మధ్య వివాదం బయటికి తెచ్చేందుకు తను చాటింగ్ చేసిన అమ్మాయిల మెసేజ్లను సోషల్ మీడియా వేదికగా బయటపెట్టిన హసీన్ జహాన్ పట్ల ఆరంభంలో అంతా సానుభూతి వ్యక్తం చేశారు. వివాదం బయటికి వచ్చిన తర్వాత వారిద్దరూ సోషల్ మీడియా వేదికగానే చేసుకున్న చర్చలతో వారి మానసిక స్థాయి పట్ల నెటిజన్లంతా పెదవి విరిచారు. షమీ భార్య హసీన్ జహాన్ హద్దు దాటి ఏకంగా అతను మ్యాచ్ ఫిక్సింగ్కు కూడా పాల్పడ్డాడంటూ ఆరోపణలు గుప్పించింది.
దీనిపై చర్యలు తీసుకోవడంలేదంటూ బీసీసీఐపై కూడా నిందలు వేయడం మొదలుపెట్టింది. నిజాలు తేల్చుకునేందుకు బీసీసీఐ న్యాయ విచారణ కమిటీ వేసి దర్యాప్తు చేపట్టింది. షమీ నిర్దోషిగా తేలడంతో బీసీసీఐ అతనిపై క్లీన్ చిట్ విడుదల చేసింది. ఇక ఆ తర్వాత తనకు.. సంతానానికి పోషణ నిమిత్తం ఖర్చులకు డబ్బులు పంపాలంటూ హసీన్ జహాన్ మరోసారి షమీపై కేసు నమోదు చేసింది. దానికి కూడా తలొగ్గిన షమీ నెలకు రూ.80వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతకుముందు ఆమె చేసిన అప్పీలులో నెలకు రూ.10లక్షలు కావాలంటూ డిమాండ్ చేసింది.