న్యూఢిల్లీ: టీమిండియాకు కోచ్ అవసరమే లేదంటున్నారు క్రికెట్ లెజెంట్ కపిల్ దేవ్. టీమిండియా కోచ్గా డంకన్ ప్లెచర్ పదవీ కాలం ముగియడంతో టీమిండియాకు కొత్త కోచ్గా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో బీసీసీఐ మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో 1983 వరల్డ్ కప్ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీమిండియా కోచ్ ఎంపికతో బీసీసీఐ అటు టైమ్ వేస్ట్ చేయడంతో పాటు డబ్బుని దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. భారత జట్టులో ధోని, విరాట్ కోహ్లీ లాంటి సూపర్ స్టార్లు ఉన్నారని పేర్కొన్నారు. ఒంటి చేత్తో భారత్కు విజాయాలనందించగల సత్తా ఉన్న ఆటాగాళ్లు ఉన్నప్పుడు కోచ్ అవసరం ఏముంటుందని ప్రశ్నించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనుభవం యువఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్లో రాణించేందుకు ఎంతో మేలు చేసిందన్నారు. జట్టును నడిపించడానికి అనుభవం కలిగిన ధోని, విరాట్ కోహ్లీ చాలని పేర్కొన్నారు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లను సరైనా దారిలో నడిపిస్తే చాలని అన్నారు.

ఫ్లెచర్ కాంట్రాక్ట్ ముగియడం... నెలలు గడిచినా ఫ్లెచర్ వారసుడిని నియమించకపోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే. జూన్ 7 నుంచి భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి కోచ్ను నియమిస్తారా? లేక కనీసం కేర్టేకర్గా ఎవరిని ప్రకటిస్తారు అనే దానిపై ఇంకా సస్పెన్స్ వీడకపోవడంతో కపిల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
గత ఏడాది ఇంగ్లాండ్ పర్యటన మధ్యలో రవిశాస్త్రిని టీమ్ డైరెక్టర్గా నియమితుడయ్యాక కోచ్గా ఫ్లెచర్ పాత్ర నామమాత్రమైంది. సహాయ కోచ్లుగా నియమితులైన భంగర్, భరత్, అరుణ్, శ్రీధర్లతో కలిసి రవిశాస్త్రే జట్టు బాధ్యతలను చూశాడు.
టీమిండియాకు ఎన్నో విజయాలను అందించిన మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీని భారత జట్టుకు హై పెర్ఫామెన్స్ మేనేజర్గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గంగూలీని హై పెర్ఫామెన్స్ మేనేజర్గా నియమిస్తే, హెడ్ కోచ్ పదివికి విలువుండదని, ముగ్గురు సహాయ కోచ్లను కొనసాగించవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.