
మాంచెస్టర్: ప్రపంచకప్ టోర్నమెంట్ తొలి సెమీఫైనల్కు వేదికగా మారిన మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియం.. మువ్వన్నెల మయమైంది. స్టేడియంలో ఎటు చూసినా భారతీయ తత్వం కనిపిస్తోంది. అడుగడుగునా జాతీయ పతాకాలు దర్శనమిస్తున్నాయి. నిండుతనాన్ని తీసుకొచ్చాయి. భారత దేశాన్ని కొన్ని దశాబ్దాల పాటు పరిపాలించిన తెల్లదొరల నడిగడ్డపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది..సగర్వంగా! మ్యాచ్ జరుగుతోంది మాంచెస్టర్లోనేనా అనే అనుమానాలను కలిగిస్తోంది.
ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియం సీట్ల సామర్థ్యం 76 వేలు. మ్యాచ్ను తిలకిస్తున్న వారిలో 40 వేల మందికి పైగా భారతీయులు ఉన్నారు. కోహ్లీసేన జైత్రయాత్రను ప్రత్యక్షంగా తిలకించడానికి భారత్ నుంచి వెళ్లిన వారు కొందరైతే.. విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇంగ్లండ్కు వెళ్లి, అక్కడే స్థిరపడిన వారు మరి కొందరు. మాంచెస్టర్లో భారతీయుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది.
అందుకే- తమ హీరోలను చూడటానికి మాంచెస్టర్లో నివసిస్తోన్న ప్రవాస భారతీయుల్లో దాదాపు 90 శాతం మంది ప్రస్తుతం ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో ఉన్నారు. ఫలితంగా- భారత జట్టు సొంత గడ్డ మ్యాచ్ ఆడుతోందన్న భావన కలిగిస్తోంది వీక్షకుల్లో. వికెట్ పడిన ప్రతీసారీ అభిమానులు రెచ్చిపోతున్నారు. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ, గట్టిగా కేకలు వేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. స్టేడియం మొత్తం భారతీయ క్రికెటర్లను ప్రోత్సహిస్తున్నారు.