భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. మొట్టమొదటి అంధులు టీ20 మహిళా ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. ఆదివారం కొలంబోలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో నేపాల్ను 7 వికెట్ల తేడాతో ఓడించి ఈ ఘనత సాధించింది. ఈ టోర్నీకి ఆస్ట్రేలియా, పాకిస్తాన్ , శ్రీలంక, అమెరికా వంటి జట్లు కూడా పాల్గొన్నాయి.
అజేయంగా ప్రపంచ విజేతగా నిలిచిన భారత్
టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టు నేపాల్ను 114 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత జట్టు కేవలం 12 ఓవర్లలోనే 117 పరుగులు చేసి సునాయాసంగా మ్యాచ్ను గెలుచుకుంది. ఈ టోర్నీలో భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా అజేయంగా నిలిచి తొలి ప్రపంచ కప్ను దక్కించుకుంది. భారత్ తరఫున ఫులా సరెన్ (27 బంతుల్లో 44 పరుగులు) అత్యధిక స్కోరర్గా నిలవగా.. నేపాల్ తరఫున సరితా ఘిమిరే(38 బంతుల్లో 35 పరుగులు) అత్యధిక స్కోరర్గా నిలిచింది. ఈ టోర్నీని శ్రీలంక, భారత్ కలిసి నిర్వహించాయి. ఫైనల్ మ్యాచ్ శ్రీలంకలోని పురాతన టెస్ట్ వేదిక అయిన పి. శరవణముత్తు స్టేడియంలో జరిగింది.

అంధుల క్రికెట్.. నియమాలు, విశేషాలు
అంధుల క్రికెట్ అనేది సాధారణ క్రికెట్ కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా లోపల బాల్ బేరింగ్లు కలిగిన తెల్ల ప్లాస్టిక్ బంతిని ఉపయోగిస్తారు. బంతి దొర్లుతున్నప్పుడు వచ్చే శబ్ధాన్ని విని ఆటగాళ్లు దానిని గుర్తించగలుగుతారు. బంతిని అండర్-ఆర్మ్ పద్ధతిలో విసరాలి. బౌలర్ బంతి వేసే ముందు బ్యాటర్ను సిద్ధంగా ఉన్నావా అని అడిగి, బంతిని విసిరేటప్పుడు "ప్లే" అని బిగ్గరగా అరిచి వేయాలి.
ప్రతి జట్టులో 11 మంది ఆటగాళ్ళు ఉంటారు. కనీసం నలుగురు ఆటగాళ్ళు పూర్తిగా అంధులుగా (B1 కేటగిరీ) ఉండాలి. ఆటలో పారదర్శకత కోసం ఆటగాళ్లందరూ కళ్లకు గంతలు ధరించడం తప్పనిసరి. B1 కేటగిరీ ఆటగాడు చేసిన ప్రతి పరుగును రెండు రెట్లు (డబుల్) లెక్కించడం ఈ ఆటలో ఒక ప్రత్యేకత. ఫీల్డర్లు తమ స్థానాలను ఇతరులకు తెలియజేయడానికి ఒకసారి చప్పట్లు కొడతారు. ఈ చారిత్రక విజయం దేశానికి గర్వకారణం. భారత మహిళా అంధ క్రికెట్ జట్టు సాధించిన ఈ విజయం దేశంలో క్రీడా స్ఫూర్తిని మరింత పెంచింది.