సెంచూరియన్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ 11 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. నాలుగు టీ20ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి టీ20లో గెలిచి రెండో మ్యాచ్లో ఓడిన సూర్యసేన గొప్పగా పుంజుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 219 పరుగులు చేసింది.
తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (107 నాటౌట్; 56 బంతుల్లో, 8 ఫోర్లు, 7 సిక్సర్ల) సెంచరీతో కదంతొక్కాడు.యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (50; 25 బంతుల్లో, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధశతంతో సత్తాచాటాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మహరాజ్, సిమెలన్ చెరో రెండు వికెట్లు, జేన్సన్ ఒక్క వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 208 పరుగులకు పరిమితమైంది.

లక్ష్యఛేదనలో ఇన్నింగ్స్ మధ్య వరకు సఫారీలు పోటీలో లేనప్పటికీ జేన్సన్ (54 నాటౌట్; 17 బంతుల్లో, 4 ఫోర్లు, 5 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (41; 22 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) గొప్ప పోరాటంతో మ్యాచ్ను హోరాహోరీగా మార్చారు. కానీ అంతిమంగా భారత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా అరుదైన రికార్డులు సాధించింది.
ఓ క్యాలెండర్ ఇయర్లో టీ20ల్లో అత్యధిక సార్లు 200+ స్కోరు సాధించిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. 2024లో భారత్ ఎనిమిది సార్లు ఈ ఘనత అందుకుంది. అంతకుముందు ఈ రికార్డు బర్మింగ్హామ్ బేర్స్ (2022), జపాన్ (2024) పేరిట ఉమ్మడిగా ఉంది. ఈ జట్లు ఏడు సార్లు 200+ స్లోరు సాధించాయి. అంతేగాక ఓ ఏడాది అత్యధిక వ్యక్తిగత సెంచరీలు నమోదు చేసిన జట్టుగా ఆర్సీబీ సరసన టీమిండియా నిలిచింది.
అయిదు సెంచరీలతో సూర్యసేన.. ఆర్సీబీ (2016)-టీమిండియా (2023) గత రికార్డులను సమం చేసింది. ఈ ఏడాది సంజు శాంసన్ రెండు సెంచరీలు, రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ తలో సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.