హైదరాబాద్: ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో వైఫల్యాలు ఎదుర్కొంటున్న టీమిండియాను ఇంగ్లాండ్ కోచ్ ట్రెవర్ బేలిస్ వెనకేసుకొచ్చాడు. ఇంగ్లాండ్ జట్టు గురించి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ జట్టుతో భారత్ ఓడిపోవడానికి వెనుక కారణాన్ని చెప్పుకొచ్చాడు. సిరీస్ ముందు తగినన్ని సన్నాహక మ్యాచ్లు ఆడకపోవడమే తొలి రెండు టెస్టుల్లో ఘోర పరాజయాలకు కారణమని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఐదు మ్యాచ్ల సిరీస్లో కోహ్లీసేన 0-2తో వెనకబడిన సంగతి తెలిసిందే.
'ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్ వంటి పెద్ద జట్లు ఎక్కువ క్రికెట్ ఆడతాయి. ఇప్పటికన్నా ఇంకా ఎక్కువ వార్మప్ మ్యాచ్లు ఆడాలని అన్ని జట్లూ భావిస్తాయి. కాకపోతే అన్నిసార్లూ అలా కుదరదు. ఎడతెరపి లేకుండా క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లకు కచ్చితంగా విశ్రాంతి అవసరం. చాలామంది అన్ని మ్యాచ్లూ ఆడతారు. అలాంటి వారు సన్నాహక మ్యాచుల్లో ఆడటం కుదరదు కదా' అని బేలిస్ అన్నారు.
ఇంగ్లాండ్ టెస్టు సిరీస్కు ముందు టీమిండియా ఒకే సన్నాహక మ్యాచ్ ఆడింది. అదీ మూడు రోజులే. అక్కడి వాతావరణానికి, పిచ్లకు అలవాటు పడేందుకు ఎక్కువ సన్నాహక మ్యాచ్లు అవసరమని సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజాలు సూచిస్తున్నా కోహ్లీసేన పట్టించుకోవడం లేదు. అక్కడి వాతావరణం వేడిగా ఉందంటూ ఐదు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ను మూడు రోజులకే కుదించేసింది భారత్.
తాము ఎక్కువ సన్నాహక మ్యాచ్లు ఆడతామని, సన్నద్ధంగా ఉన్నారా అనే ప్రశ్నలు తరచుగా తమకు ఎదురవుతాయని బేలిస్ అన్నారు. ఎక్కువ వార్మప్ మ్యాచ్లు ఆడాలని ఉన్నా వారంలో 10 రోజులు ఉండవు కదా! అని పేర్కొన్నారు. సిరీస్లో అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, క్రిస్వోక్స్ ప్రదర్శన అద్భుతమని బేలిస్ ప్రశంసించారు. రెండో టెస్టులో వోక్స్, జానీ బెయిర్స్టో కీలక భాగస్వామ్యం విజయానికి తోడ్పడిందని పేర్కొన్నాడు.