మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా రాంచీలో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా దక్షిణాఫ్రికా జట్టుపై ఉత్కంఠభరితంగా పోరాడి విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా ఈ సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. మ్యాచ్లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి విరాట్ కోహ్లీ సెంచరీ దెబ్బకు 349 పరుగుల భారీ స్కోరు సాధించగా.. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు 332 పరుగులకే పరిమితమైంది. ఈ క్రమంలో భారత్ 17 రన్స్ తేడాతో విజయం సాధించింది.
టీమిండియా పరుగుల పర్వతం
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (135 పరుగులు) తన 52వ వన్డే శతకంతో భారీ స్కోరు అందించాడు. కోహ్లీ తన 120 బంతుల మెరుపు ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టి ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిచాడు. క్రికెట్లోని ఈ ఏకైక ఫార్మాట్లో తన విలువ, ఆధిపత్యాన్ని కోహ్లీ మరోసారి నిరూపించాడు.కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ (51 బంతుల్లో 57) తో కలిసి రెండో వికెట్కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీ స్కోరుకు పునాది వేశారు. కోహ్లీ టీ20 అంతర్జాతీయ ఫార్మాట్లో భాగం కాకపోవడం, భారత్కు రాబోయే 8 నెలల్లో కేవలం ఆరు వన్డే మ్యాచ్లు మాత్రమే ఉండటంతో, 36 ఏళ్ల కోహ్లీకి ఈ ఫార్మాట్లోని ప్రతి మ్యాచ్ ఎంతో ముఖ్యం. తన ప్రదర్శన ద్వారా అతను ఈ ఫార్మాట్లో అత్యంత నమ్మదగిన బ్యాటర్గా ఉన్నానని సెలెక్టర్లకు, టీమ్ మేనేజ్మెంట్కు గుర్తుచేశాడు.

రో-కో జోడీ అద్భుతం
క్రికెట్ ప్రేమికులు ఎప్పటి నుంచో కోహ్లీ, రోహిత్ నుండి పెద్ద ఇన్నింగ్స్లు ఆశించారు. ఈ మ్యాచ్లో వారిద్దరి మధ్య ఏర్పడిన 136 పరుగుల భాగస్వామ్యం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాక, వారు ఇప్పటికీ పెద్ద వేదికలపై స్టార్స్గా రాణించగలరని టీమ్ మేనేజ్మెంట్కు భరోసా ఇచ్చింది. రోహిత్ శర్మ కేవలం ఒక పరుగు వద్ద లభించిన లైఫ్ను సద్వినియోగం చేసుకుని, మార్కో యాన్సెన్ చేతిలో ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యే ముందు అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.
యశస్వి జైస్వాల్ (18) వికెట్ త్వరగా పడిపోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. బర్గర్ బౌలింగ్లో మిడ్-ఆఫ్ మీదుగా సిక్సర్ కొట్టి తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. కోహ్లీ ఒక అద్భుతమైన కవర్ డ్రైవ్ కూడా ఆడాడు. బాష్ బౌలింగ్లో సిక్సర్ కొట్టి కోహ్లీ తన అర్ధ సెంచరీని పూర్తి చేయగా, రోహిత్ ఒక సింగిల్ తీసి ఫిఫ్టీ మార్కును దాటాడు. దీంతో భారత్ త్వరగా 100 పరుగుల మార్కును దాటింది. రుతురాజ్ గైక్వాడ్ (8, వాషింగ్టన్ సుందర్ త్వరగా ఔట్ అయినప్పటికీ కోహ్లీ క్రీజులో నిలదొక్కుకున్నాడు. కోహ్లీ సెంచరీ పూర్తి చేసిన వెంటనే, ఒక అభిమాని భద్రతా వలయాన్ని ఛేదించుకుని వచ్చి మోకాలిపై కూర్చుని అతని పాదాలను తాకడం జరిగింది.
కెప్టెన్ కేఎల్ రాహుల్ (60 పరుగులు) స్పిన్నర్ ప్రేన్లన్ సుబ్రయన్ బౌలింగ్లో ఇబ్బంది పడుతున్నా, ఆఖర్లో వేగంగా ఆడి స్కోరును పెంచాడు. కోహ్లీ కూడా సుబ్రయన్ బౌలింగ్లో రెండు సిక్సర్లు , ఒక ఫోర్తో 21 పరుగులు రాబట్టాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో యాన్సెన్, నాండ్రే బర్గర్, కార్బిన్ బాష్, ఒట్నీల్ బార్ట్మాన్ తలో రెండు వికెట్లు తీశారు.
బౌలింగ్లో మ్యాజిక్
భారత్ 349 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా, దక్షిణాఫ్రికా కూడా దీటుగా బదులిచ్చింది. అయితే, తుది దశలో భారత్ బౌలర్లు, ముఖ్యంగా యువ పేసర్ హర్షిత్ రాణా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాయాజాలం ప్రదర్శించారు. కీలక సమయాల్లో వికెట్లు తీయడం, పరుగులను కట్టడి చేయడం ద్వారా దక్షిణాఫ్రికాను 332 పరుగులకే పరిమితం చేశారు. దీంతో టీమిండియా 17 పరుగుల స్వల్ప తేడాతో విజయాన్ని అందుకుంది.