హైదరాబాద్: తమతో ద్వైపాక్షిక సిరీస్లు ఆడనందుకు పరిహారం కోరుతూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పంపిన లీగల్ నోటీసుపై ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించాడు. పాక్లో పర్యటించేందుకు భద్రతా కారణాలే అసలు సమస్యని ఆయన తేల్చి చెప్పారు.
'వాళ్లు ఇక్కడ.. మేం అక్కడ ఆడేందుకు ఒకప్పుడు ఒప్పందాలుండేవి. ఐతే పాకిస్థాన్లో భద్రత పరిస్థితులు అక్కడ సిరీస్ ఆడేందుకు తగ్గట్లు లేవు. గత కొన్నేళ్లలో ఒక్క జింబాబ్వే మినహా ఏ జట్టూ పాకిస్థాన్లో పర్యటించలేదు. మిగతా జట్లలాగే మేమూ భద్రత పట్ల ఆందోళనగా ఉన్నాం. మ్యాచ్ల కోసం మా ఆటగాళ్ల ప్రాణాలను పణంగా పెట్టలేం' అని అన్నారు.
ఇక పాకిస్థాన్తో సిరిస్ ఆడేందుకు భారత ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని, అనుమతి రాకుండా మేమెలా ముందుకు వెళ్లగలం? అని రాజీవ్ శుక్లా ప్రశ్నించాడు. ఇక ద్వైపాక్షిక సిరీస్ల ఒప్పంద ఉల్లంఘనపై పాక్ క్రికెట్ బోర్డు ఇచ్చిన నోటీసుకు దీటుగానే బదులిస్తామని చెప్పారు.

ఇక ఐపీఎల్లో పుణే, గుజరాత్ ఫ్రాంచైజీలకు పొడిగింపు లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. లీగ్తో ఈ రెండు ఫ్రాంచైజీలకు కేవలం రెండేళ్ల ఒప్పందమే ఉందని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రెండేళ్ల సస్పెన్షన్కు గురైన చెన్నై, రాజస్తాన్లను వచ్చే సీజన్ నుంచి అనుమతిస్తామని చెప్పారు.
ఒక వేళ ఐపీఎల్లో 8 జట్లకు బదులు 10 జట్లకు స్థానం కల్పించినా... కొత్తగా బిడ్డింగ్ నిర్వహిస్తాం తప్ప పుణే, గుజరాత్లను కొనసాగించేది లేదని తేల్చిచెప్పారు. ఎన్ని జట్లు ఆడతాయనే విషయాన్ని ఐపీఎల్ పాలక మండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ప్రసార హక్కులను ఇకపై ఐదేళ్ల వరకే ఇస్తామని అన్నారు. సుప్రీం కోర్టు నియమించిన బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) మార్గదర్శకాల ప్రకారమే ఈ ఒప్పందాలు జరుగుతాయని చెప్పారు. టైటిల్ స్పాన్సర్షిప్ కట్టబెట్టేందుకు కొత్తగా ఈ వేలం నిర్వహిస్తామని చెప్పారు.