
హైదరాబాద్: ఒత్తిడిని అధిగమించే విషయంలో ఇంగ్లాండ్ కంటే భారతే మెరుగ్గా కనిపిస్తుందని టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ప్రస్తుతం కోహ్లీసేన సుదీర్ఘ సిరిస్ కోసం ఇంగ్లాండ్లో పర్యటిస్తోంది. ఇరు జట్ల మధ్య ఆగస్టు 1 నుంచి ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆరంభం కానుంది.
ఈ నేపథ్యంలో భారత జట్టు ప్రదర్శనపై మంజ్రేకర్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. గాయం కారణంగా పేస్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్ ఇంగ్లాండ్తో తొలి మూడు టెస్టులకు దూరం కాగా, బుమ్రా బర్మింగ్హామ్ వేదికగా జరిగే తొలి టెస్టుకు చోటు దక్కించుకునే అవకాశం కష్టమేనని తెలిసింది.
దీనిపై మంజ్రేకర్ మాట్లాడుతూ "ఇలాంటి గొప్ప టెస్టు సిరీస్కు అందరూ ఫిట్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే గాయాల కారణంగా భారత్కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దీంతో ఇంగ్లాండ్ ఫేవరెట్గా బరిలోకి దిగవచ్చు. అలా అని భారత్ను తక్కువ అంచనా వేయలేం" అని అన్నాడు.
"ఎందుకంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ప్రస్తుత భారత జట్టు అత్యుత్తమంగా రాణించగలదు. ఒత్తిడిని సైతం ఎంతో సులభంగా అధిగమించగలదు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు మ్యాచే దీనికి ప్రత్యేక ఉదాహరణ అని" అని అన్నాడు.
"ప్రస్తుత జట్టును చూస్తుంటే 1990ల నాటి భారత్ బ్యాటింగ్ లైనప్ గుర్తుకొస్తుంది. అప్పట్లో భారత్కు సచిన్ టెండూల్కర్ ఏవిధంగా కీలకమో.. ప్రస్తుతం కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అలానే ఉన్నాడు" అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో కెఎల్ రాహుల్ కీలకం కానున్నాడని అన్నాడు.
ఇదిలా ఉంటే ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్తో బర్మింగ్ హామ్ వేదికగా కోహ్లీసేన తొలి టెస్టులో తలపడనుంది. ఇంగ్లీష్ టీమ్పై 11 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ విజయం సాధించడమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగనుంది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్పై ఆధిపత్యం ప్రదర్శించాలని కోహ్లీసేన తహతహలాడుతోంది.