ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో విజయకేతనం ఎగురవేసిన భారత్.. దక్షిణాఫ్రికాలో మాత్రం టెస్టు సిరీస్ ఇప్పటికీ గెలవలేకపోయింది. ఇప్పటివరకు ఎనిమిది సార్లు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన సిరీస్ డ్రా చేయడమే. అయితే ఈ సారి చరిత్ర సృష్టించడానికి రోహిత్ సేన కసితో బరిలోకి దిగుతుంది.
వన్డే వరల్డ్ కప్లో ఇరు జట్లు గొప్ప ప్రదర్శన చేశాయి. కానీ కప్ను అందుకోలేకపోయాయి. ఆ మెగాటోర్నీ అనంతరం స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా తిరిగి బరిలోకి దిగనున్నారు. దీంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కానీ సూపర్ ఫామ్లో ఉన్న మహ్మద్ షమి గాయంతో జట్టుకు దూరమవ్వడం టీమిండియా అభిమానులను కలవరపెడుతోంది.

ఈ నేపథ్యంలో షమి గురించి దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడాడు. షమి అత్యుత్తమ ప్లేయర్ అని, కానీ అతడు లేకపోయినా టీమిండియా బలంగానే ఉందని అన్నాడు. ''ఎవరైనా అత్యుత్తమ ఆటగాళ్లతో తలపడాలని కోరుకుంటారు. గొప్ప ప్లేయర్లలో షమి ఒక్కరు. అతడిని సమర్థంగా ఎదుర్కోవాలని ఎంతో మంది భావిస్తారు. కానీ అది భారత్. టీమిండియా బలం గురించి అందరికీ తెలుసు. జట్టులో ఎవరు ఉన్నా ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేస్తారు''
'' టీమిండియా బౌలింగ్ దళం చాలా బలమైనది. షమి లేకపోయినా అది బలంగానే ఉంటుంది. గత అయిదు నుంచి పదేళ్లలో టీమిండియా టెస్టుల్లో సాధించిన విజయాల్లో బౌలర్లే కీలక పాత్ర పోషించాడు. అయితే
సొంత మైదానాల్లో మేం ఆడటమే మాకు అదనపు బలం. ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవాలి'' అని బవుమా అన్నాడు.
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు షమిని సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ అతడు గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే సఫారీ గడ్డకు వెళ్తాడని వివరించారు. కానీ షమి పూర్తిగా కోలుకోలేదు. డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. చివరి టెస్టు కేప్టౌన్లో జనవరి 03న మొదలవుతుంది. అయితే తొలి టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. భారీ వర్షం వల్ల తొలి రోజు ఆట దాదాపుగా తుడిచిపెట్టుకుపోయే అవకాశముంంది. రెండో రోజు కూడా చాలా ఓవర్ల ఆట నష్టం జరగొచ్చు.