సంజు శాంసన్ (108; 114 బంతుల్లో) వీరోచిత సెంచరీతో, అర్షదీప్ సింగ్ (4/30) బంతితో చెలరేగడంతో దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ మరోసారి సత్తాచాటింది. పార్ల్ వేదికగా గురువారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 78 పరుగుల తేడాతో విజయం సాధించి వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. సఫారీ గడ్డపై వన్డే ఫార్మాట్లో టీమిండియాకు ఇది రెండో సిరీస్ విజయం. అంతకుముందు 2017-18లో భారత్ వన్డే సిరీస్ సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు శుభారంభం దక్కలేదు. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన రజత్ పటిదర్ (22; 16 బంతుల్లో) బర్గర్ బౌలింగ్లో ఔటయ్యాడు. కానీ రజత్ ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. మరో యువ ఓపెనర్ సాయి సుదర్శన్ (10; 16 బంతుల్లో) ఎక్కువ సేపు క్రీజులో నిలవేలదు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన కేఎల్ రాహుల్ (21; 35 బంతుల్లో)తో కలిసి సంజు శాంసన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు అర్ధశతక భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ రాహుల్ను ముల్డర్ బోల్తా కొట్టించాడు.

అనంతరం తిలక్ వర్మ (52; 77 బంతుల్లో) కలిసి శాంసన్ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. క్రీజులో వచ్చిన తర్వాత తిలక్ జాగ్రత్తగా ఆడటంతో టీమిండియా రన్రేట్ తగ్గింది. కుదురుకున్న అనంతరం తిలక్ స్పీడ్ పెంచాడు. కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ సాధించిన అనంతరం తిలక్ ఔటయ్యాడు. కాసేపటికే శాంసన్ కూడా తొలి సెంచరీ సాధించాడు. వీరిద్దరు 116 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.ఆఖర్లో రింకూ సింగ్ (38; 27 బంతుల్లో), వాషింగ్టన్ సుందర్ (14; 9 బంతుల్లో) దూకుడుగా ఆడటంతో భారత్ 296 పరుగులు చేసింది.
అనంతరం ఛేదనలో భారత్ బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. అర్షదీప్ సింగ్ (4/30), సుందర్ (2/38), అవేశ్ ఖాన్ (2/45) సత్తాచాటారు. అయితే ఓ దశలో 141/2తో దక్షిణాఫ్రికా మెరుగైన స్థితిలోనే ఉంది. కానీ టీమిండియా బౌలర్లు క్రమంగా వికెట్ల తీసి పైచేయి సాధించారు. ఓపెనర్ టోనీ డి జోర్జి (81; 87 బంతుల్లో) మరోసారి రాణించాడు. కెప్టెన్ మార్క్రమ్ (36), క్లాసెన్ (21) పరుగులు చేశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సంజు శాంసన్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అర్షదీప్కు దక్కింది.