దంబుల్లా: శ్రీలంకతో జరిగిన రెండో వన్డే క్రికెట్ మ్యాచులో భారత్ కష్టపడి గెలిచింది. శ్రీలంకపై భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి వన్డేలో శ్రీలంక విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్ ను భారత్ సమం చేసింది. శ్రీలంక బౌలర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాట్స్ మెన్ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, కొత్త ఆటగాడు బద్రీనాధ్ నిలకడగా, సంయమనంతో ఆడి భారత్ కు విజయాన్ని చేరువ చేశారు. ఆట ముగిసే సమయానికి బద్రీనాథ్ 27 పరుగులతో నాటవుట్ గా ఉన్నాడు. జహీర్ ఖాన్ రెండు పరుగులు చేసి నాటవుట్ గా మిగిలాడు. కోహ్లీతో కలిసి ఇన్నింగ్సును ప్రారంభించిన ఇర్ఫాన్ పఠాన్ ఐదు పరుగులకే అవుటయ్యాడు. కోహ్లీ మాత్రం 37 పరుగులు చేశాడు. యువరాజ్ 20 పరుగులు చేశాడు. రైనా, హర్భజన్ ఒక్కటేసి పరుగులకే అవుట్, రోహిత్ శర్మ డకవుట్ అయ్యాడు. కులశేఖర, తుషారా, మెండిస్ రెండేసి వికెట్లు తీసుకోగా ఫెర్నాండోకు ఒక్క వికెట్ లభించింది. మురళీధరన్ కు ఒక్క వికెట్ కూడా పడలేదు.
అంతకు ముందు తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ కు భారత బౌలర్లు బుధవారం రెండో వన్డేలో ప్రతీకారం తీర్చుకున్నారు. సరిగ్గా శ్రీలంకను 142 పరుగులకు ఆల్ అవుట్ చేశారు. తొలి వన్డేలో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి ఇదే స్కోరును సాధించింది. జహీర్ ఖాన్ చెలరేగి బౌలింగ్ చేయడంతో శ్రీలంక టాప్ ఆర్డర్ కూలిపోయింది. 44 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన శ్రీలంకను తుషార, కులశేఖర ఆదుకున్నారు. టాప్ ఆర్డర్ చేతులెత్తేసినప్పటికీ టెయిల్ ఎండర్లు భారత బౌలర్లను చికాకు పరిచారు. తషార 44 పరుగులు చేయగా, కులశేఖర 25 పరుగులు చేశాడు. నాలుగు పరుగులకే శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయింది. శ్రీలంక 38.3 ఓవర్లకే చేతులెత్తేసింది.
భారత బౌలర్లలో జహీర్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా, ప్రవీణ్ కుమార్ మూడు వికెట్లు తీశాడు. హర్భజన్ కు రెండు వికెట్లు, పఠాన్ ఒక్క వికెట్ తీశారు. జయసూర్య కూడా భారత బౌలర్లను ఎదుర్కోవడానికి తడబడ్డాడు. జయసూర్య 13 పరుగులు మాత్రమే చేశాడు. సంగక్కర రెండు పరుగులు చేశాడు. చివరలో ఫెర్నాండో 12 పరుగులు చేశాడు. జయవర్ధనే రెండు పరుగులు చేయగా, కపుగెదర డకవుట్ అయ్యాడు. శ్రీలంగ ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే భారత్ తన ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. విరాట్ కోహ్లీతో కలిసి ఇర్ఫాన్ భారత ఇన్నింగ్సును ప్రారంభించాడు. జ్వరం కారణంగా సెహ్వాగ్ ఈ మ్యాచుకు దూరమయ్యాడు.