
కోహ్లికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
ముంబై టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్లో కూడా ఆరు వికెట్లు తీసుకున్నాడు. ఈ టెస్టులో డబుల్ సెంచరీ చేసిన కెప్టెన్ కోహ్లికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇదిలా ఉండే ముంబై టెస్టులో పలు రికార్డులు నమోదయ్యాయి.

తొలి ఇన్నింగ్స్లో 400 పరుగులు చేసిన టీమ్ ఓడిపోవడం ఇదే తొలిసారి
వాంఖడే స్టేడియంలో తొలి ఇన్నింగ్స్లో 400 పరుగులు చేసిన టీమ్ ఓడిపోవడం ఇదే తొలిసారి. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 400 పరుగులు చేయగా భారత్ 631 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. భారత ఆటగాళ్లలో కోహ్లి (235) డబుల్ సెంచరీ, విజయ్ (136), జయంత్ యాదవ్ (104) సెంచరీలు చేశారు.
అశ్విన్కు రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 12 వికెట్లు
రెండో ఇన్నింగ్స్లో అశ్విన్ 6, జడేజా 2, భువనేశ్వర్, జయంత్ చెరొ వికెట్ తీసుకున్నారు. అశ్విన్ రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 12 వికెట్లు తీసుకున్నాడు. ఓ మ్యాచ్లో పది వికెట్లు తీసుకోవడం అతనికిది ఏడోసారి. ఎనిమిదేళ్ల తర్వాత ఇంగ్లాండ్పై టీమిండియా సిరిస్ గెలిచింది. టెస్టు విజయం తర్వాత టీమిండియా వాంఖడే స్టేడియంలో అభిమానులకు అభివాదం చేసింది.

వరుసగా ఐదు టెస్టు సిరీస్లను గెలిచిన టీమిండియా
కాగా, టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి ఇన్నింగ్స్లో 400 పరుగులు చేసిన ఓ జట్టు ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం ఇది మూడోసారి. ఈ విజయంతో టీమిండియా వరుసగా ఐదు టెస్టు సిరీస్లను గెలిచింది. అంతేకాదు 2014లో ఇంగ్లాండ్తో కోల్పోయిన ట్రోఫీని తిరిగి చేజిక్కించుకున్నట్లయింది.

విరాట్ కోహ్లీకి కెప్టెన్గా 13వ విజయం
ఇక విరాట్ కోహ్లీకి కెప్టెన్గా 13వ విజయం. టీమిండియా మాజీ కెప్టెన్లు ధోనీ, గంగూలీ, అజర్ తర్వాతి స్థానంలో విరాట్ నిలిచాడు. ఇక స్వదేశంలో వరుసగా 17 టెస్టుల నుంచి ఓటమెరగని రికార్డును ఈ మ్యాచ్తో టీమిండియా సొంతం చేసుకుంది. ఈ సిరీస్కు ముందు ఇంగ్లాండ్ భారత్పై వరుసగా మూడు సిరీస్ విజయాలు సాధించింది. 2011లో ఇంగ్లండ్లో, 2012లో భారత్లో, 2014లో మరోసారి ఇంగ్లండ్లో విజయాలు సాధించింది.


Click it and Unblock the Notifications











