హైదరాబాద్: బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. 188 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ప్రత్యర్థి ముందు ఉంచిన కోహ్లి సేన 75 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
నిజానికి తొలి ఇన్నింగ్స్లో కోహ్లీ సేన బ్యాటింగ్ను చూసిన సగటు క్రికెట్ అభిమాని ఓడిపోతుందని అనుకున్నాడు. అయితే రెండో ఇన్నింగ్స్లో అనూహ్యాంగా పుంజుకున్న కోహ్లీ సేన అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో నాలుగు టెస్టుల సిరిస్ 1-1తో సమమైంది.

నాలుగో రోజు ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ను కూల్చడంలో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలకపాత్ర పోషించాడు. 41 పరుగులిచ్చిన ఆశ్విన్ 6 వికెట్లు తీసి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. అశ్విన్ ఒక ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీయడం ఇది 25వ సారి.
ఈ నేపథ్యంలో అశ్విన్ మరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు భారత గడ్డపై 200 వికెట్ను కూడా అతను ఇదే మ్యాచ్లో సొంతం చేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో చివరి ఆరు వికెట్లను ఆస్ట్రేలియా 11 పరుగుల తేడాతో కోల్పోవడం విశేషం.
తొలి టెస్టులో ఘోర ఓటమి పాలైన టీమిండియా, రెండో టెస్టులో తడబడి, ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో బెంగుళూరు టెస్టులో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న కోహ్లీసేనపై ట్విట్టర్లో ప్రశంసల జల్లు కురుస్తోంది.
'చెక్ దే ఇండియా' అంటూ సీనియర్ క్రికెటర్లు, ప్రముఖులు టీమిండియాపై ప్రశంసలు కురిపించారు. కోహ్లీసేనపై ప్రశంసలు కురిపించిన వారి జాబితాలో సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, మహమ్మద్ కైఫ్ తదితరులు ఉన్నారు.