హైదరాబాద్: నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు, కోహ్లీ సేనకు షాకిచ్చేందుకు ఒక రహస్య అస్త్రాన్ని సిద్దం చేసిందట. ఆ రహస్య అస్త్రం పేరు మిచెల్ స్వెప్సన్. 23 ఏళ్ల స్వెప్ సన్ లెగ్ స్పిన్నర్గా ఆస్ట్రేలియాలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో అతడిని భారత పర్యటనకు ఎంపిక చేశారు. స్వెప్ సెన్ ఎలా బౌలింగ్ చేస్తాడన్న విషయం టీమిండియా ఆటగాళ్లకు తెలియకుండా ఆస్ట్రేలియా జాగ్రత్త పడుతూ వస్తుండటం విశేషం. భారత పర్యటనలో స్వెప్ సెన్ తప్పక రాణిస్తాడని ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ వా అంటున్నాడు.
స్వెప్ సన్ బౌలింగ్పై ప్రశంసలు కురిపించిన మాజీ కెప్టెన్ స్టీవ్ వా, భారత క్రికెటర్లను తన మాయాజాలంతో ఆశ్చర్యపరిచే సత్తా అతడికి ఉందని పేర్కొన్నాడు. ఇటీవల ఓ కార్యక్రమంలో స్పిన్ లెజెండ్ షేన్వార్న్ కూడా స్వెప్ సన్ను పొగడ్తలతో ముంచెత్తాడు.

స్వెప్సన్ మాత్రం తనను దిగ్గజ క్రికెటర్లు పొగడడం ఆనందమిచ్చే విషయమే అయినా, ఇండియా పిచ్ లపై ఆడటం సవాళ్లతో కూడుకున్నదని అన్నాడు. 'ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి బౌలింగ్ కూడా ఎవరికీ ఆశ్చర్యం కలిగించదు. టీవీ ఫుటేజ్ చాలా అందుబాటులో ఉంది. కాబట్టి భారత్ నన్ను ఎదుర్కోవడానికి సన్నద్ధంగానే ఉంటుందనుకుంటున్నా' అని స్వెప్సన్ చెప్పాడు.
భారత పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ చేయాల్సి ఉంటుందని స్వెప్సన్ పేర్కొన్నాడు. 'ఆస్ట్రేలియాలో మాదిరి భారత్లో బౌలింగ్ చేయలేం. దుబాయిలో నేర్చుకున్నదాని ప్రకారం భారత్లో పరిస్థితులకు తగ్గట్లుగా నా బౌలింగ్ను మార్చుకుంటా' అని స్వెప్సన్ పేర్కొన్నాడు.
నాలుగు టెస్టుల సిరీస్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఫిబ్రవరి 13 (సోమవారం) ముంబైకి చేరుకోనుంది. తొలి టెస్టు మ్యాచ్ పూణెలో ఫిబ్రవరి 23న ప్రారంభం కానుంది.