బంగ్లాదేశ్తో జరుగుతున్న చివరి సూపర్-4 మ్యాచ్లో భారత జట్టు కీలక మార్పులు చేసింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడి పిచ్పై పచ్చిక కనిపిస్తోందని, అలాగే చాలా గట్టిగా ఉందని నిపుణులు చెప్తున్నారు. పేసర్లకు మంచి బౌన్స్ లభిస్తుందని, అదే సమయంలో మిడిల్ ఓవర్లలో పిచ్ నెమ్మదించే ఛాన్స్ ఉందని సమాచారం.
ఈ మ్యాచులో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అరంగేట్రం చేస్తున్నాడు. టాస్కు ముందు రోహిత్ చేతుల మీదుగా తిలక్ తన డెబ్యూ క్యాప్ అందుకున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్.. జట్టులో ఏకంగా ఐదు మార్పులు చేసినట్లు చెప్పాడు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్కు విశ్రాంతి ఇచ్చినట్లు వెల్లడించాడు.

ఇప్పటి వరకు తాము లైట్స్ కింద బ్యాటింగ్ చేయలేదని, అందుకే తాము ముందుగా ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నామని రోహిత్ స్పష్టం చేశాడు. ఇలాంటి ఛాలెంజ్లు స్వీకరించడం తమకు చాలా ముఖ్యమని అన్నాడు. అలాగే తిలక్ వర్మతోపాటు సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ ఆడుతున్నారని రోహిత్ ప్రకటించాడు.
ఇక బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ మాట్లాడుతూ తంజీబ్ షకీబ్ అరంగేట్రం చేస్తున్నట్లు చెప్పాడు. ఈ మ్యాచ్లో తిలక్ బౌలింగ్ వేసే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మ్యాచ్ ఆరంభానికి ముందు తిలక్ బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తూ కనిపించాడు. సూర్యకుమార్ ఈ మ్యాచ్లో ఎలా రాణిస్తాడనేది టీమిండియాకు కీలకం కానుంది.
అతను వన్డే వరల్డ్ కప్ జట్టులో కూడా ఉండటం వల్ల సూర్య ఈ ఫార్మాట్లో రాణించడం చాలా ముఖ్యం. ఇక గాయంతో గత రెండు మ్యాచులకు దూరమైన శ్రేయాస్ అయ్యర్ కోలుకున్నడని, కానీ పూర్తి ఫిట్నెస్ సాధించలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో అతను ఈ మ్యాచ్ కూడా ఆడటం లేదు.
బంగ్లాదేశ్ జట్టు: లిటాన్ దాస్, తంజీద్ హసన్ తమీమ్, అనాముల్ హక్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), తౌహీద్ హృదోయ్, షమీమ్ హుస్సేన్, మెహదీ హసన్ మిరాజ్, మెహదీ హసన్, నాసుమ్ అహ్మద్, తంజీమ్ షసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ