శ్రీలంక, పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత ఆసియా కప్ ఫైనల్లో భారత్ను ఢీకొట్టే జట్టు ఏదో తేలిపోయింది. అయితే దాని కన్నా ముందు భారత్ మరో నామమాత్రపు మ్యాచ్ ఆడాల్సి ఉంది. సూపర్-4 చివరి మ్యాచులో బంగ్లాదేశ్ను ఎదుర్కోనుంది. అయితే ఈ మ్యాచ్కు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఆసియా కప్లో శ్రీలంక వేదికగా జరుగుతన్న దాదాపు ప్రతి మ్యాచ్కూ వరుణుడు ఆటంకం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. భారత్, శ్రీలంక మ్యాచ్ మినహా ప్రతి మ్యాచ్ వర్షం వల్ల ఇబ్బంది పడింది. ఇక భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అయితే రిజర్వ్ డేకు కూడా వెళ్లింది. ఈ క్రమంలోనే భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొనేలా కనిపిస్తోంది.

ఈ టోర్నీలో నాకౌట్ రౌండ్లో ఇంటి దారి పట్టిన తొలి టీం బంగ్లాదేశ్ కావడం గమనార్హం. శ్రీలంక, పాకిస్తాన్ రెండు టీమ్స్ చేతిలో చిత్తయిన బంగ్లాదేశ్.. అందరి కన్నా ముందుగా ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. ఇక శ్రీలంక చేతిలో ఓటమితో పాక్ కూడా ఆసియా కప్ ఫైనల్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. పాకిస్తాన్, శ్రీలంకపై విజయాలతో ఇప్పటికే టీమిండియా ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే.
గతేడాది చివర్లో భారత్పై వన్డే సిరీస్ నెగ్గిన బంగ్లాదేశ్.. ఇప్పుడు కూడా అలాంటి ప్రదర్శనే చేయాలని అనుకుంటోంది. అదే సమయంలో ఇప్పటికే ఫైనల్ బెర్తు ఖరారైన టీమిండియా జట్టులో కొన్ని ప్రయోగాలు చేయాలని అనుకుంటోంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం వల్ల ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరుగుతున్నంత సేపూ ఆకాశం 90 శాతం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా.
అంతేకాదు కొలంబోలో ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా భారీ వర్షాలు, తుఫాను వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. భారత్, బంగ్లా మ్యాచ్ సమయంలో 65 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం జరిగిన శ్రీలంక, పాకిస్తాన్ మ్యాచ్కు కూడా వర్షం అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే.